వారంతంలో భారీ నష్టం:1500 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం (ఫిబ్రవరి 26) భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుండి బలహీన సంకేతాలకు తోడు ఆసియా మార్కెట్లు నష్టాల్లో ఉన్న నేపథ్యంలో సూచీలు నేలచూపులు చూశాయి. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ స్టాక్స్, ఐటీ, రియాల్టీ రంగాలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. బీఎస్ఈ టాప్ 30 కంపెనీల్లో 29 నష్టాల్లోనే ట్రేడ్ అయ్యాయి. బాండ్ ఈల్డ్స్ పెరగడం, కమోడిటీ ధరలు ఎగబాకడం ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బతీసింది. వరుసగా మూడు రోజుల పాటు లాభపడిన మార్కెట్లు నేడు భారీ నష్టాల్లో కదిలాయి.
సెన్సెక్స్ భారీగా నష్టం
స్టాక్ మార్కెట్లు నేడు భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం సెన్సెక్స్ 50,256 పాయింట్ల వద్ద ప్రారంభమై, 50,400 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 49,549 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ మధ్యాహ్నం గం.11.30 సమయానికి ఏకంగా 1500 పాయింట్ల మేర నష్టపోయింది. 1488 పాయంట్లు లేదా 2.92 శాతం క్షీణించి 49,549 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. నిఫ్ట 14,888 పాయింట్ల వద్ద ప్రారంభమై, 14,919 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 14,775 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది.
టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో సన్ ఫార్మా 1.75 శాతం, అల్ట్రా టెక్ సిమెంట్ 1.42 శాతం, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ 1.34 శాతం, సిప్లా 1.17 శాతం, దివిస్ ల్యాబ్స్ 1.01 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో ఇండస్ఇండ్ బ్యాంకు 4.42 శాతం, బజాజ్ ఫిన్ సర్వ్ 4.15 శాతం, HDFC 3.94 శాతం, ICICI బ్యాంకు 3.88 శాతం, యాక్సిస్ బ్యాంకు 3.70 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్లో అల్ట్రా టెక్ సిమెంట్, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, దివిస్ ల్యాబ్స్, సిప్లా ఉన్నాయి.
రంగాలవారీగా..
నిఫ్టీ 50 సూచీ 2.54 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 1.90 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఆటో 1.92 శాతం, నిఫ్టీ బ్యాంకు 3.79 శాతం, నిఫ్టీ ఎనర్జీ 2.03 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 3.95 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.90 శాతం, నిఫ్టీ ఐటీ 1.88 శాతం,నిఫ్టీ మీడియా 1.42 శాతం, నిఫ్టీ మెటల్ 2.37 శాతం, నిఫ్టీ పీఎస్యూ బ్యాంకు 3.62 శాతం, నిఫ్టీ రియాల్టీ 2.48 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 1.36 శాతం నష్టపోయాయి. కేవలం నిఫ్టీ ఫార్మా 0.58 శాతం లాభపడింది.