SBI లాభాలు ఏకంగా 52% జంప్, వడ్డీ ఆదాయం 15% ప్లస్
ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) బుధవారం 2020-21 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ఏడాది ప్రాతిపదికన నికర లాభం 51.9 శాతం పెరిగింది. గత ఏడాది సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.3,011.73 కోట్లుగా ఉండగా, ఈసారి అదే సమయంలో రూ.4,574.16 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. బ్యాంకింగ్ రంగ నిపుణుల అంచనాలకు మించి లాభాలు పెరగడం గమనార్హం. మొత్తం ఆదాయం విషయానికి వస్తే రూ.75,341.80 కోట్లుగా నమోదయింది. గత ఏడాది రూ.72,850.78 కోట్లతో పోలిస్తే 3.42 శాతం ఎగిసింది.
మోడీతో 3వ అమెరికా అధ్యక్షుడు! జోబిడెన్ గెలిస్తే భారత్తో సంబంధాలు ఎలా ఉంటాయి?
నికర వడ్డీ ఆదాయం 14 శాతం జంప్
సెప్టెంబర్ త్రైమాసికానికి గాను నికర వడ్డీ ఆదాయం(NII) 14.56 శాతం పెరిగి రూ.28,181 కోట్లుగా నమోదయింది. ఏడాది క్రితం వడ్డీ ఆదాయం రూ.64,312.39 కోట్లుగా ఉండగా, ఈసారి రూ.66,814.11 కోట్లుగా ఉంది. నికర వడ్డీ మార్జిన్(NIMs) గత ఏడాది 3.32 శాతంగా ఉండగా, ఈసారి 3.34 శాతంగా నమోదయింది. జీవిత బీమా అనుబంధ సంస్థల్లో వాటా విక్రయం కారణంగా ప్రొవిజన్లకు ముందు నిర్వహణ లాభం మెరుగుపడినట్లు బ్యాంకు తెలిపింది. ఉద్యోగుల వేతన సవరణ కోసం రూ.2,124 కోట్లు, కోవిడ్ సంబంధ ఖాతాల కోసం రూ.239 కోట్లు కేటాయించినట్లు తెలిపింది. పన్నుకు ముందు లాభం 25 శాతం పుంజుకొని రూ.6,341 కోట్లను దాటింది. ప్రొవిజన్లు 23 శాతం తక్కువగా రూ.10,118 కోట్లకు చేరుకున్నాయి.
ఎన్పీఏలు 5.28 శాతం
బ్యాంకు గ్రాస్ ఎన్పీఏలు 5.28 శాతంగా ఉన్నాయి. గత ఏడాది ఇదే త్రైమాసికంలో 7.19 శాతంగా ఉండగా, ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 5.44 శాతంగా ఉంది. నికర ఎన్పీఏ సెప్టెంబర్ త్రైమాసికంలో 1.59 శాతంగా ఉంది. జూన్ త్రైమాసికంలో ఇది 1.86 శాతంగా ఉండగా, ఏడాది క్రితం ఇదే సమయంలో 2.79 శాతంగా ఉంది. ఎస్బీఐ క్యాపిటల్ అడిక్వెసీ రేషియో 14.72 శాతంగా ఉంది. జూన్ క్వార్టర్లో ఇది 13.40 శాతంగా ఉండగా, గత ఏడాది ఇదే త్రైమాసికంలో 13.59 శాతంగా ఉంది.
క్రెడిట్ గ్రోత్, హోంలోన్ వాటా
ఏడాది ప్రాతిపదికన బ్యాంకు క్రెడిట్ గ్రోత్ 6.02 శాతంగా నమోదయింది. ఏడాది ప్రాతిపదికన రిటైల్(పర్సనల్) అడ్వాన్స్లు 14.55 శాతం, అగ్రి అడ్వాన్స్ 4.19 శాతం, కార్పోరేట్ అడ్వాన్స్ 2.82 శాతంగా ఉంది.
ఎస్బీఐ నికర వడ్డీ ఆదాయం దాదాపు 15 శాతం పెరిగింది.
డొమెస్టిక్ సగటు వడ్డీ మార్జిన్ 3.34 శాతం పెరిగింది.
నాన్-ఇంటరెస్ట్ ఇన్కం దాదాపు స్థిరంగా ఉంది. గత ఏడాది రూ.8,538 కోట్లు కాగా, ఈసారి రూ.8,528 కోట్లుగా ఉంది.
మొత్తం డిపాజిట్లు 14.41 శాతం పెరిగాయి. ఇందులో కరెంట్ అకౌంట్ డిపాజిట్లు 8.55 శాతం పెరిగాయి. సేవింగ్ బ్యాంక్ డిపాజిట్ 16.28 శాతం పెరిగింది.
హోంలోన్ వాటా 23 శాతంగా ఉంది.
కాగా, ఎస్బీఐ స్టాక్ ధర నేడు 0.37 శాతం లాభపడి రూ.205.50 వద్ద ముగిసింది. ఓ సమయంలో రూ.208 పైకి చేరుకుంది.