డాలర్ బలహీనం, మరింత బలపడుతున్న రూపాయి: కారణాలివే
గత రెండు నెలలుగా పతనాన్ని చవిచూస్తున్న రూపాయి కొద్ది రోజులుగా స్థిరంగా కనిపిస్తోంది. ఈ రోజు (జూన్ 10, బుధవారం) అమెరికా డాలర్ మారకంతో రూపాయి 12 పైసలు బలపడి 75.49 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. ఓ దశలో 75.26 వద్ద ట్రేడ్ అయింది. మంగళవారం నాటి సెషన్లో 75.61 వద్ద క్లోజ్ అయింది. కరోనా మహమ్మారి కారణంగా ఇటీవలి వరకు నష్టపోయిన మార్కెట్లు కూడా లాభాల్లోకి వస్తోన్న విషయం తెలిసిందే.
Covid 19: భారత్కు అండగా నిన్న బంగారం, నేడు ఫారెక్స్ నిల్వలు: ఆర్థిక వ్యవస్థకు ఎలా లాభం
రూపాయి బలపడటం వెనుక..
రూపాయి బలపడటానికి వివిధ కారణాలు ఉన్నాయి. ఇతర దేశాల కరెన్సీలతో పోలిస్తే ఇటీవల డాలర్ వ్యాల్యూ కాస్త తగ్గింది. ఇక, దేశీయ స్టాక్ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్లు తిరిగి కొనుగోళ్లు జరిపేందుకు మొగ్గు చూపుతున్నారని, దీంతో రూపాయి స్థిరంగా ఉందని చెబుతున్నారు. అలాగే, అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరల పతనం, పారెక్స్ నిల్వలు వరుసగా కొత్త జీవనకాల గరిష్టానికి చేరుకోవడం వంటి అంశాలు రూపాయి బలపడేందుకు దోహదపడ్డాయి.
డాలర్ ఇండెక్స్ బలహీనం
కొన్ని ప్రత్యేక కారణాల కలయికలు రూపాయి స్థిరత్వానికి తోడ్పడ్డాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా యువాన్ బలపడటం, డాలర్ ఇండెక్స్ బలహీనం కావడం దేశీయ ఈక్విటీ మార్కెట్లోకి ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ రావడానికి దోహదపడ్డాయి. ఇటీవలి కాలంలో రిలయన్స్ వంటి దిగ్గజ సంస్థలు వాటాలు అమ్మడంతో పాటు రైట్స్ ఇష్యూ, ఎఫ్డీఐలు స్థానిక కరెన్సీకి డిమాండ్ పెంచాయి. దాదాపు రెండు నెలల లాక్ డౌన్ తర్వాత ఆఱ్థిక వ్యవస్థలు కోరుకుంటున్నాయి. దీంతో ఓవర్సీస్ ఇన్వెస్టర్లు ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గు చూపుతున్నారు.
పెట్టుబడుల రాక
ఇండియన్ ఈక్విటీ మార్కెట్లలోకి ఎఫ్ఐఐలు గత వారం రోజుల్లో 3 బిలియన్ డాలర్ల కొనుగోళ్లు జరిపారు. మార్చి నెలలో దాదాపు 7.7 బిలియన్ డాలర్ల అమ్మకాలు జరిపారు. ఏప్రిల్లో అమ్మకాలు జరిగాయి. తైవాన్, సౌత్ కొరియా దేసాల ఈక్విటీ మార్కెట్లలో జరిపిన కొనుగోళ్ల కంటే ఇవి ఎక్కువ. కరోనా భయాలు తొలగిపోతుండటం, జాగ్రత్తలు తీసుకోవడం వంటి చర్యలు తిరిగి పెట్టుబడులు రావడానికి ఉపకరిస్తోంది.
లాభాల్లో ముగిసిన మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు కూడా ఈ రోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం గం.9.30 సమయానికి సెన్సెక్స్ 200కు పైగా, నిఫ్టీ 55 పాయింట్లకు పైగా లాభాల్లో ట్రేడ్ అయింది. సెన్సెక్స్ మధ్యాహ్నం గం.1.30 సమయానికి 190 పాయింట్ల లాభంతో 34,145 వద్ద ఉంది. ఆసియా మార్కెట్లు కూడా లాభాల్లోనే ఉన్నాయి. అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. సాయంత్రం మార్కెట్ క్లోజింగ్ సమయానికి సెన్సెక్స్ 290 పాయింట్లు ఎగిసి 34,247.05 వద్ద, నిఫ్టీ 69.50 పాయింట్లు పెరిగి 10,116.20 వద్ద ముగిసింది. టాప్ గెయినర్స్ జాబితాలో ఇండస్ ఇండ్ బ్యాంకు, హిండాల్కో, శ్రీ సిమెంట్స్, రిలయన్స్, కొటక్ మహీంద్రా బ్యాంకు ఉండగా, టాప్ లూజర్స్ జాబితాలో హీరో మోటో కార్ప్, గెయిల్, బజాజ్ ఆటో, కోల్ ఇండియా, టాటా స్టీల్ ఉన్నాయి.