ఆర్బీఐ ఖజనాలో భారీగా పెరిగిన బంగారం నిల్వలు, తగ్గిన ఫారెక్స్ రిజర్వ్స్
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) వద్ద బంగారం నిల్వలు పెరిగాయి. గత రెండేళ్ల కాలంలోనే 100 టన్నులకు పైగా కొనుగోలు చేసింది. ఈ ఏడాది మార్చితో ముగిసిన అంతకుముందు 6 నెలల్లో ఆర్బీఐ పసిడి నిల్వలను 16.58 టన్నుల మేర పెంచుకుంది. దీంతో 2022 మార్చి చివరి నాటికి కేంద్ర బ్యాంకు వద్ద 760.42 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. 2017-18 ఆర్థిక సంవత్సరం నుండి ఆర్బీఐ వద్ద బంగారం నిల్వలు క్రమంగా పెరుగుతున్నాయి.
ఓ వైపు బంగారం నిల్వలు పెరుగుతుండగా, మరోవైపు విదేశీ మారకపు నిల్వలు తగ్గుతూ వస్తున్నాయి. 2021 సెప్టెంబర్ నాటికి ఆర్బీఐ వద్ద ఫారెక్స్ నిల్వలు 64,245 కోట్ల డాలర్లు ఉండగా, ఈ నెల 6వ తేదీతో ముగిసిన వారానికి 59,595 కోట్ల డాలర్లకు తగ్గాయి. అంటే గత ఎనిమిది తొమ్మిది నెలల కాలంలో 4650 కోట్ల డాలర్ల ఫారెక్స్ నిల్వలు తగ్గాయి. ఫారెక్స్ నిల్వలు తగ్గడానికి ప్రధాన కారణం ఈ కాలంలో FPIలు దేశీయ స్టాక్ మార్కెట్ నుండి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఉపసంహరించుకోవడమే.
డాలర్ వ్యాల్యూలో ఆర్బీఐ వద్ద ఉన్న మొత్తం విదేశీ మారకపు నిల్వల్లో బంగారం వాటా సెప్టెంబర్ 2021లో 5.88 శాతం ఉండగా, మార్చి 2022 చివరి నాటికి 7.01 శాతానికి పెరిగాయి. 2014 తర్వాత ఇదే గరిష్టం. ప్రపంచంలో అతిపెద్ద ఆస్తి రిజర్వ్లో బంగారానిది మూడో స్థానం. అమెరికా డాలర్, యూరో కరెన్సీ తర్వాత పసిడి ఉంది. అత్యవసర పరిస్థితుల్లో ఆర్థిక సంక్షోభాల నుండి రక్షణ కోసం దాదాపు అన్ని దేశాలు బంగారాన్ని పోగు చేసుకుంటాయి. ఇందులో భారత్ 9వ స్థానంలో ఉంది.