Rakesh Jhunjhunwala: రికార్డు స్థాయికి బిగ్ బుల్ స్టాక్.. కొత్త టార్కెట్ ధర ఇదే.. ఒక్కరోజే రూ.160 పెరుగుదల..!
Rakesh Jhunjhunwala: దివంగత మార్కెట్ ఇన్వెస్టర్ రాకేష్ జున్జున్వాలా ప్రస్తుతం లేనప్పటికీ ఆయన స్టాక్స్ అనేక మందికి లాభాలను తెచ్చిపెడుతున్నాయి. ఆయన పెట్టుబడిపెట్టిన స్టాక్ ఈ రోజు ట్రేడింగ్ లో రికార్డు స్థాయికి చేరుకుంది.
కంపెనీ వివరాలు..
ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది రాకేష్ జున్జున్వాలా ఇన్వెస్ట్ చేసిన వ్యవసాయ పరికరాల తయారీ సంస్థ ఎస్కార్ట్స్ కుబోటా గురించే. ఈ కంపెనీలో జూన్ త్రైమాసికం చివరి నాటికి ఆయన 18.30 లక్షల షేర్లతో మెుత్తం 1.39 శాతం వాటాను కలిగి ఉన్నారు. ఈ రోజు మార్కెట్లో స్టాక్ రికార్డు స్థాయిలో లాభపడి రూ. 2,090 వద్ద ముగిసింది. కేవలం ఈ ఒక్కరోజే స్టాక్ రూ.160కి పైగా లాభపడింది.
గరిష్ఠాలను తాకిన స్టాక్..
ఎస్కార్ట్స్ కుబోటా షేర్లు ట్రేడింగ్ లో ఆల్-టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. బీఎస్ఈలో 10 శాతం పెరిగి రూ.2,122 వద్ద ఇంట్రాడేలో గరిష్ఠ స్థాయిని నమోదు చేశాయి. ఈ షేరు ఏడాది కాలంలో 43.53 శాతం లాభపడింది. ఈ సంవత్సర ప్రారంభం నుంచి 9.15 శాతం పెరుగుదలను నమోదు చేసింది. ఈ స్టాక్ ఒక నెలలో 17.09 శాతం పెరిగింది. బీఎస్ఈలో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.27,443 కోట్లకు చేరుకుంది.
షేర్ హోల్డింగ్ వివరాలు..
15 మంది ప్రమోటర్లు సంస్థలో 72.90 శాతం వాటాను కలిగి ఉన్నారు. జూన్ 2022తో ముగిసిన త్రైమాసికానికి 1,64,277 పబ్లిక్ షేర్హోల్డర్లు 25.30 శాతం లేదా 3.33 కోట్ల షేర్లను కలిగి ఉన్నారు. జూన్ 2022తో ముగిసిన త్రైమాసికంలో 27 మంది వాటాదారులు మాత్రమే 2.20 శాతం వాటాతో రూ. 2 లక్షల కంటే ఎక్కువ వాటాను కలిగి ఉన్నారు. దీనికి తోడు 121 మంది విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు 55.95 లక్షల షేర్లను కలిగి ఉన్నారు.
బ్రోకరేజ్ ల మాట ఏమిటంటే..
ICICI డైరెక్ట్ ఎస్కార్ట్స్ కుబోటా టార్గెట్ ధరను రూ.2,390గా నిర్ణయిస్తూ BUY రేటింగ్ అందించింది. ప్రస్తుత మార్కెట్ ధరతో పోల్చితే ఇది 14 శాతం ఎక్కువ. బ్రోకరేజ్ స్టాక్ను HOLD నుండి BUYకి అప్గ్రేడ్ చేసింది. ఇదే సమయంలో మోతీలాల్ ఓస్వాల్ స్టాక్కు సెప్టెంబర్ 1న తటస్థ కాల్ ఇచ్చింది.
ఎస్కార్ట్స్ కుబోటా వ్యాపారం..
ఎస్కార్ట్స్ కుబోటాను గతంలో ఎస్కార్ట్స్ లిమిటెడ్ అని పిలిచేవారు. జూన్ 2022లో కొత్త ఈక్విటీ షేర్లకు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా, పబ్లిక్ షేర్హోల్డర్లకు ఓపెన్ ఆఫర్ ద్వారా జపాన్కు చెందిన కుబోటా కార్పొరేషన్ ఎస్కార్ట్స్లో తన వాటాను 44.8 శాతానికి పెంచుకున్న నేపథ్యంలో సంస్థ పేరు మార్చుకుంది. కంపెనీ వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, రైల్వేలకు పరిష్కారాలను అందిస్తుంది. కంపెనీ నాలుగు విభాగాల ద్వారా పనిచేస్తుంది: వ్యవసాయ యంత్రాలు, నిర్మాణ పరికరాలు, రైల్వే పరికరాలు, ఆటో అనుబంధ ఉత్పత్తులు ఇందులో ఉన్నాయి.