11వసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు: ముంబైలో సెంచరీకి చేరువలో
రెండు రోజుల విరామం తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు నేడు (మే 21, శుక్రవారం) పెరిగాయి. లీటర్ పెట్రోల్ పైన 19 పైసలు, లీటర్ డీజిల్ పైన 29 పైసలు పెరిగింది. తాజా పెరుగుదలతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.93.04కు, లీటర్ డీజిల్ రూ.83.80కి చేరుకుంది. ముంబైలో పెట్రోల్ రూ.99.32, డీజిల్ రూ.91.01గా ఉంది.
గత 18 రోజుల్లో లీటర్ పెట్రోల్ పైన రూ.2.64 పైసలు, లీటర్ డీజిల్ పైన రూ.3.07 పైసలు పెరిగింది. మే 18వ తేదీన పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఆ తర్వాత రెండు రోజులు యథాతథంగా ఉన్నాయి. నేడు మళ్లీ పెరిగాయి. ఈ నెలలో ధరలు పెరగడం ఇది 11వసారి. దేశంలోని పలు ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకున్నాయి.రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో చమురు ధరలు రూ.100 క్రాస్ చేశాయి. ముంబైలో ప్రస్తుతం పెట్రోల్ సెంచరీకి సమీపంలో ఉంది.
పెట్రోల్, డీజిల్ పైన కేంద్ర, రాష్ట్ర పన్నుల వాటానే అధికం. ఉదాహరణకు ఢిల్లీలో చూసుకుంటే మే 16న లీటర్ పెట్రోల్ రూ.92.88గా ఉంది. ట్యాక్స్ బ్రేక్ చూసుకుంటే లీటర్ పెట్రోల్ బేస్ ప్రైస్ రూ.34.19. రవాణా తదితర ఖర్చులు 0.36 పైసలు. డీలర్స్కు వేసే ఛార్జ్ (ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్ మినహా) రూ.34.55. ఎక్సైజ్ డ్యూటీ రూ.32.90. డీలర్ కమిషనర్ (యావరేజ్) రూ.3.77. వ్యాట్ రూ.21.36. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ మే 16వ తేదీన రూ.83.22గా ఉంది. ట్యాక్స్ బ్రేక్ చూస్తే బేస్ ప్రైస్ రూ.36.32. రవాణా తదితర ఖర్చులు 0.33 పైసలు. డీలర్స్కు వేసే ఛార్జ్ (ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్ మినహా) రూ.36.65. ఎక్సైజ్ డ్యూటీ రూ.31.80. డీలర్ కమిషనర్ (యావరేజ్) రూ.2.58. వ్యాట్ రూ.12.19.
అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు మళ్లీ 70 డాలర్లకు చేరుకున్నాయి.బ్రెంట్ ఈ స్థాయిని తాకడం మార్చి 15వ తేదీ తర్వాత ఇదే మొదటిసారి. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియెట్ కూడా పెరిగింది. అమెరికా, యూరోప్ మార్కెట్లు క్రమంగా తెరుచుకుంటుండటంతో ఇంధన డిమాండ్ పుంజుకోనుందనే సంకేతాలు చమురు డిమాండ్ను పెంచాయి.