బంగారంపై ఎలాంటి స్కీం తేవట్లేదు: పసిడి వినియోగదారులకు కేంద్రం ఊరట
న్యూఢిల్లీ: నల్లధనం నిర్మూలన కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం మరో భారీ నిర్ణయంతో ముందుకు రానుందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. బ్లాక్ మనీని టార్గెట్ చేసుకొని 2016 నవంబర్ 8న రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేస్తూ అనూహ్య నిర్ణయం తీసుకున్న మోడీ ప్రభుత్వం, ఆ తర్వాత జీఎస్టీని ప్రవేశపెట్టింది. ఇప్పుడు బంగారంపై దృష్టి సారించిందని, ఇందుకోసం క్షమాభిక్ష స్కీం ప్రవేశ పెట్టనుందని జోరుగా వార్తలు వచ్చాయి. అయితే దీనిపై ఫైనాన్స్ మినిస్ట్రీ వర్గాలు స్పందించినట్లుగా ఏఎన్ఐ ట్వీట్ చేసింది.
గోల్డ్ స్కీంకు సంబంధించిన వార్తలు ఇక్కడ చూడండి
కేంద్రం ఎలాంటి గోల్డ్ స్కీం లేదా క్షమాభిక్ష పథకం తీసుకువచ్చే యోచన చేయడం లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతానికి అలాంటి ప్రతిపాదన ఏదీ కూడా ఇన్కం ట్యాక్స్ డిపార్టుమెంట్ పరిశీలనలో లేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి. బడ్జెట్ ప్రక్రియ కొనసాగుతోందని, కాబట్టి ఇలాంటి ఊహాజనిత వార్తలు వస్తుంటాయని పేర్కొంది. బంగారంపై పరిమితి తీసుకు వస్తే ఎంత ఉంటుంది, పన్ను వేస్తే ఎంత వేస్తారు, ఎప్పటి వరకు సమయం ఇస్తారనే ఆందోళన కొందరిలో ఉండవచ్చు. అలాంటి వారికి ఇది భారీ ఊరట కలిగించే అంశం.
రెండు రోజులుగా మీడియాలో బంగారం పథకంపై వార్తలు వచ్చాయి. బంగారానికి సంబంధించి కేంద్రం ఓ ఆమ్నెస్టీ పథకాన్ని తీసుకు రానుందని, ప్రతిపాదిత పథకం కింద నిర్ణీత ప్రమాణానికి మించి ఉన్న బంగారంపై జరిమానా ఉంటుందని పేర్కొన్నాయి. ఈ పథకానికి సంబంధించిన అన్ని వివరాలు వెల్లడి కావాల్సి ఉందని, అయితే ఇది ప్రస్తుతం కేంద్రం పరిశీలనలో మాత్రమే ఉందని కూడా పేర్కొన్నాయి.