భారీ లాభాల్లోకి మార్కెట్లు.. కారణాలివే, ఇన్వెస్టర్ల లక్షల కోట్ల సంపద రికవరీ
ముంబై: నిన్న స్వల్ప లాభాల్లో ముగిసిన మార్కెట్లు నేడు (బుధవారం, మార్చి 25) భారీ లాభాల్లోకి వచ్చాయి. ఈ రోజు మార్కెట్ క్లోజ్ అయ్యే సమయానికి సెన్సెక్స్ 1,861.75 పాయింట్లు (6.98%) ఎగిసి 28,535.78 వద్ద, నిఫ్టీ 516.80 (6.62%) పాయింట్లు పెరిగి 8,317.85 వద్ద క్లోజ్ అయింది. 1194 షేర్లు లాభాల్లో, 976 షేర్లు నష్టాల్లో ముగియగా, 153 షేర్లలో ఎలాంటి మార్పు లేదు. రిలయన్స్ ఇండస్ట్రీస్, HDFC బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంకు, యూపీఎల్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ భారీ లాభాలు మూటగట్టుకున్న టాప్ 5 జాబితాలో ఉన్నాయి. భారీ నష్టాలు మూటగట్టుకున్న వాటిలో యస్ బ్యాంకు, ఇండస్ ఇండ్ బ్యాంకు, ఐవోసీ, కోల్ ఇండియా, గెయిల్ ఉన్నాయి. మార్కెట్లు లాభాల్లోకి రావడానికి వివిధ కారణాలు ఉన్నాయి.
కరోనా: 2 రోజులు లేదా మార్చి 31 దాకా... స్టాక్ మార్కెట్లు క్లోజ్!? నేడు యథాతథం
అందుకే మార్కెట్ల దూకుడు
అమెరికా ఆర్థిక వ్యవస్థకు 2 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక సాయం అందించే ప్యాకేజీపై సెనెట్ నాయకులు, శ్వేసౌధం ఒక అవగాహనకు వచ్చింది. దీంతో మార్కెట్లు పరుగులు తీశాయి. అప్పటికే నిన్న కొంత లాభాల్లోకి వచ్చిన మార్కెట్లు, ఇప్పుడు అమెరికా ప్యాకేజీ కారణంతో మరింత దూకుడు ప్రదర్శించాయి. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఆర్థిక ప్యాకేజీ సిద్ధమవుతోందని ప్రకటించడం మార్కెట్లకు ఊపు తెచ్చింది.
రిలయన్స్, హెచ్డీఎఫ్సీ ట్విన్స్ దూకుడు
రిలయన్స్ ఇండస్ట్రీస్కు చెందిన జియోలో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ 10 శాతం వాటాలు కొనుగోలు చేయనుందని ప్రచారం సాగింది. దీంతో ఈ కంపెనీ లాభాలు ఏకంగా 21 శాతం పెరిగాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ షేర్లు భారీ ర్యాలీ సాధించాయి.
లాభాల్లో అంతర్జాతీయ మార్కెట్లు
అంతర్జాతీయ మార్కెట్లు కూడా లాభాల్లోకి వచ్చాయి. డౌ ఫ్యూచర్స్ 2 శాతం పెరిగాయి. నాస్డాక్, ఎస్ అండ్ పీ 500 ఫ్యూచర్స్ కూడా ర్యాలీ సాధించాయి. మంగళవారం డౌ జోన్స్ 11.37 శాతం లాభపడింది. 1933 తర్వాత ఒక్కరోజు ఇంత ర్యాలీ సాధించడం ఇదే మొదటిసారి. నాస్డాక్, ఎస్ అండ్ పీ 500 వరుసగా 8 శాతం, 9 శాతం లాభాలు చూశాయి. ఆసియా మార్కెట్లు కూడా లాభాల్లోకి వచ్చాయి.
నిన్న ఒక్కరోజే రూ.1.82 లక్షల కోట్లు
నిన్న స్టాక్ మార్కెట్లు స్వల్పంగా లాభపడిన సమయంలోనే ఇన్వెస్టర్ల సంపద రూ.1.82 లక్షల కోట్లు పెరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే BSEలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,82,770 కోట్లు పెరిగి రూ.103.69 లక్షల కోట్లకు చేరుకుంది. నేడు మార్కెట్లు నిన్నటి కంటే మూడు రెట్లు లాభపడ్డాయి.