5,948 కోట్ల వర్కింగ్ హవర్స్ లాస్.. ఆ మేరకు ప్యాకేజీ కావాలి! కరోనాపై సమర్థవంత పోరు
కరోనా మహమ్మారి కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ పట్టాలు ఎక్కడానికి మరో ఆర్థిక ప్యాకేజీ కావాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) రీసెర్చ్ నివేదిక పేర్కొంది. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ (GDP)లో 3 శాతం నుండి 5 శాతం మధ్య ఆర్థిక ప్యాకేజీ అవసరమని వెల్లడించింది. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం మార్చి చివరి వారం నుండి రెండు నెలలకు పైగా లాక్ డౌన్ విధించింది. ఈ నేపథ్యంలో 2020-21 ఆర్థిక సంవత్సరంలో తొలి త్రైమాసికంలో భారీగా వర్కింగ్ హవర్స్ నష్టపోయింది.
ఆ సమయంలో 5,948 పని గంటల నష్టం
ఈ కాలంలో మొత్తంగా 5,948 కోట్ల పని గంటలు భారత్ నష్టపోయింది. దీనికి సమానమైన ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ అవసరమని, ఈ అంతరాన్ని పూడ్చేందుకు జీడీపీలో 3 శాతం నుండి 5 శాతం మధ్య ప్యాకేజీ అవసరమని ఎస్బీఐ నివేదిక తెలిపింది. వర్కింగ్ హవర్స్ కోల్పోవడం వల్ల లేబర్ మార్కెట్ పైన ప్రభావం పడిందని తెలిపింది. భారత ఆర్థిక వ్యవస్థ అక్టోబర్ నెలలో పుంజుకుందని ఈ నివేదిక తెలిపింది. ఇందుకు వాహనాల సేల్స్, ఆర్టీవో ట్రాన్సాక్షన్స్, మ్యానుఫ్యాక్చరింగ్ పీఎంఐ, జీఎస్టీ ఈ-వే బిల్స్, పెట్రోల్ వినియోగం పెరిగినట్లు తెలిపింది. వాహనాల సేల్స్ నుండి జీఎస్టీ కలెక్షన్ల వరకు అన్ని కరోనా ముందుస్థాయికి చేరుకున్నాయని ఈ నివేదికలో తెలిపింది. పెట్రోల్, డీజిల్ వినియోగం కూడా సాధారణ స్థితికి చేరుకుందన్నారు.
కరోనాపై సమర్థవంత పోరు
కరోనా మహమ్మారిని భారత ప్రభుత్వం సమర్థవంతంగా ఫేస్ చేశాయని ఈ నివేదిక తెలిపింది. లాక్ డౌన్ నేపథ్యంలో నిలిచిపోయిన కార్యకలాపాలు సెప్టెంబర్ నుండి కాస్త పుంజుకున్నట్లు తెలిపింది. కరోనాను అరికట్టడంలో కొన్ని రాష్ట్రాలు వైఫల్యం చెందాయి. ఉత్తర ప్రదేశ్, బీహార్ గుజరాత్, జార్ఖండ్ రాష్ట్రాలు కరోనాపై సమర్థవంతంగా పోరు సల్పినట్లు తెలిపింది. ఏపీ, మహారాష్ట్ర, చత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, తమిళనాడు కరోనా అదుపులో విఫలమైనట్లు తెలిపింది. మొత్తంగా కేంద్రం కరోనాను ఊహించిన దానికంటే సమర్థవంతంగా ఎదుర్కొందని తెలిపింది.
త్రైమాసిక ఫలితాలు బాగున్నాయి
భారత ఆర్థిక వ్యవస్థ వేగం పుంజుకున్నట్టు సంకేతాలు కనిపిస్తున్నాయని ఈ నివేదిక తెలిపింది. కరోనా సెకండ్ వేవ్ నుండి భారత్ తప్పించుకున్నట్టుగా కనిపిస్తోందని పేర్కొంది. అత్యవసర వస్తువులు ఉత్పత్తి చేసే కంపెనీలు ప్రకటించిన రెండో త్రైమాసికం ఆర్థిక ఫలితాలు బాగున్నాయని, ఇందుకు భిన్నంగా నాన్-ఎసెన్షియల్ వస్తువులు ఉత్పత్తి చేసే కంపెనీల ఫలితాలు బలహీనంగా ఉన్నట్లు తెలిపింది. కొత్త కేసుల్లో గ్రామీణ ప్రాంతాలు అధికంగా ఉన్న జిల్లాల వాటా సెప్టెంబరులో 43.4 శాతం ఉండగా అక్టోబర్ నాటికి 39 శాతానికి తగ్గిందని తెలిపింది.