బంగారాన్ని తీసుకోవడం లేదు, బ్యాంకులకు మరింత భారమే: వారు వేలం వేస్తున్నారు..
బ్యాంకులకు బంగారం రుణాలు భారం కానున్నాయా? గోల్డ్ లోన్తో ఎన్పీఏలు పెరగనున్నాయా? అంటే అవుననే అంటున్నారు. గత త్రైమాసికంలో మణప్పురం ఫైనాన్స్ వంటి ఎన్బీఎఫ్సీ రూ.404 కోట్ల విలువ కలిగిన 1 టన్ను వరకు బంగారాన్ని వేలం వేసింది. ఇంత మొత్తంలో ఓ ఎన్బీఎఫ్సీ బంగారాన్ని వేలం వేయడం ద్వారా కరోనా నేపథ్యంలో ప్రజల చేతుల్లో నగదు లేక, రుణాలు తీర్చలేక ఆ బంగారాన్ని వదిలేయడానికి అద్దం పడుతుందని అంటున్నారు.
గత కొద్దికాలంగా బ్యాంకులు ఇచ్చిన గోల్డ్ రుణాల్లో ఎక్కువ వరకు ఎన్పీఏలుగా మారడానికి ఇది సంకేతంగా భావిస్తున్నారు. ప్రభుత్వ బ్యాంకులు బంగారం లేదా బంగారు నగలను తాకట్టు పెట్టుకొని రూ.2 లక్షల కోట్ల వరకు రుణాలు మంజూరు చేశాయి.
బంగారం రుణాలు ఒత్తిడి
కరోనా కారణంగా ఆదాయాలు పడిపోవడంతో చాలామంది గతంలో పసిడి రుణాలను ఆశ్రయించారు. దానికి తోడు గత ఏడాది 10 గ్రాముల బంగారం ధర రూ. 56,000 వరకు ఉంది. అంతేకాకుండా ఆర్బీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా బ్యాంకులు బంగారం విలువలో 90 శాతం వరకు రుణాలు మంజూరు చేశాయి. మరోవైపు ఎన్బీఎఫ్సీలైన ముత్తూట్ ఫైనాన్స్, మణప్పురం ఫైనాన్స్ వంటి కంపెనీలు మూడు నుండ తొమ్మిది నెలల కాలానికే బంగారం రుణాలను ఇచ్చాయి. PSBs మాత్రం ఏడాది కాలానికి ఇచ్చాయి. బంగారం రుణాలు బ్యాంకులకు ఇఫ్పుడు ఒత్తిడి అంటున్నారు.
విడిపించుకునే పరిస్థితి లేదు
గత ఏడాది కరోనా సమయంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. దీంతో బంగారంపై ప్రస్తుత వ్యాల్యూతో అధిక రుణాలు ఇవ్వవలసి వచ్చింది. అయితే అంతలోనే కరోనా సెకండ్ వేవ్ రావడంతో ప్రజల ఆర్థిక పరిస్థితి మెరుగు పడటం లేదు. దీంతో ఆభరణాలు లేదా బంగారం విడిపించుకునే పరిస్థితి లేదు. ఇది బ్యాంకులకు ఇబ్బందికరంగా మారే ప్రమాదం ఉంది.
బంగారం ధరలు తగ్గిన భారం
గత ఏడాది ధరతో పోలిస్తే ప్రస్తుతం పసిడి ధర 10 శాతం తక్కువగా ఉంది. దీంతో బంగారం రుణాలు తీసుకున్న చాలామంది ఆ రుణాలు చెల్లించేందుకు పెద్దగా ఆసక్తి చూపడంలేదు. దీంతో తాకట్టు పెట్టిన బంగారాన్ని అలాగే ఉండిపోతోంది. బంగారాన్ని వేలం వేసి బకాయిలు వసూలు చేసుకోవడం తప్ప బ్యాంకులకు మరో మార్గంలేదు. అలా చేసినా వడ్డీతో పాటు అసలుకు 10 శాతం వరకు లోటు ఏర్పడుతుందని అంచనా. ఈ భారం ఎంత ఉంటుందనే విషయం ఈ ఏడాది సెప్టెంబర్ నెలాఖరుకు గానీ తెలియదని అంటున్నారు.