ముంబైలో 24 గంటలు పనిచేస్తే ఎకానమీ పెరుగుతుందా?
ముంబై మహానగరం... దేశ ఆర్థిక రాజధాని. దీనికి నిద్రించని నగరం (ది సిటీ దట్ నెవెర్ స్లీప్స్) అనే ముద్దు పేరు కూడా ఉంది. ఎప్పుడూ బిజీ బిజీగా కనిపించే ముంబైలో జీవనం సాఫీగా సాగాలంటే ఎక్కువ కష్టపడాలంటారు. ఎందుకంటే అక్కడ జీవన వ్యయం (కాస్ట్ ఆఫ్ లివింగ్) చాలా ఎక్కువ. అందుకే, ఒకటికి మించిన ఉద్యోగాలు చేస్తూ, పగలూ రాత్రి కష్టపడతారు అక్కడి జనాలు. సాధారణంగా ముంబై బిజీ లైఫ్ కు తగ్గట్టే అక్కడ షాపులు కూడా కొంత ఎక్కువ సేపు తెరిచే ఉంటాయి.
ఫుడ్ స్టాల్ల్స్, రిటైల్ షాపులు, అత్యవసర సరుకుల దుకాణాలు కాస్త ఎక్కువ సమయం వరకు ప్రజలకు అందుబాటులో ఉంటాయి. ఇటీవల మహారాష్ట్రలో అధికారంలోకి వచ్చిన శివసేన సర్కారు... కొత్త విధానం తీసుకురానున్నట్లు ప్రకటించింది. త్వరలోనే ముంబైలోని షాపులు, ఫుడ్ కోర్టులు అన్నీ కూడా 24 గంటలు తెరిచే ఉంచవచ్చు. ప్రజలు ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు, అలాగే షాపింగ్ కూడా చేసుకోవచ్చు. ఇది అమల్లోకి వస్తే ఆ మహానగరంలో రాబోయే కొత్త పరిణామాలు ఏమిటి అనే అంశంపై విశ్లేషణాత్మక కథనం మీకోసం.
ఈ నెల 27 నుంచి ప్రారంభం...
మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే దీనిపై స్పష్టమైన ప్రకటన చేసింది. ఈ నెల 27 నుంచే ముంబై మహానగరంలో అన్ని రకాల షాపులు, ఆహార స్టాళ్లు 24 గంటల పాటు తెరిచి ఉంచే సౌలభ్యం కల్పిస్తోంది. ఇందుకు దుకాణ జయమానుల స్వయం అంగీకారం సరిపోతుంది. అయితే, దీని వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయి అనే అంశాలు ప్రస్తుతం చర్చకు వస్తున్నాయి. దేశంలోనే 24 గంటల పాటు పనిచేసే నగరంగా ముంబై గుర్తింపు పొందనుంది. ఈ ప్రయోగం విజయవంతం అయితే, ఇండియా లోని మిగితా నగరాలు కూడా ముంబై ని ఫాలో అయ్యే అవకాశాలు ఉంటాయి. అప్పుడు కేవలం ఒక్క సిటీ లోనే కాకుండా, మొత్తం దేశం మీద, దేశ ఆర్థిక వ్యవస్థ మీద ఎలాంటి సానుకూల ప్రభావం చూపుతుందో ఆర్థికవేత్తలు అంచనాలు వేయటం ప్రారంభించారు.
న్యూయార్క్ ఆదర్శం...
అమెరికా ఆర్థిక రాజధాని ఐన న్యూయార్క్ సిటీ... ఈ విషయంలో ముంబై కి ఆదర్శంగా నిలుస్తుంది. న్యూయార్క్ సిటీ ని కూడా ది సిటీ దట్ నెవెర్ స్లీప్స్ అనే పిలుస్తారు. స్టాక్ మార్కెట్ లావాదేవీలు, కార్పొరేట్ కంపెనీల హెడ్ క్వార్టర్స్, పెట్టుబడి సంస్థల కార్యాలయాలు, వాణిజ్య పరంగా పెద్ద ఎత్తున జరిగే లావాదేవీల కేంద్రం న్యూయార్క్. కానీ న్యూయార్క్ లో అధికారికంగా 24 గంటల పనివేళలు అంటూ ఏమి లేవు. కానీ ఆ సిటీ 24 గంటలూ హడావిడిగానే కనిపిస్తుంది. సరిగ్గా అలాంటి లక్షణాలతో, సుమారు 2 కోట్ల జనాభాతో ముంబై మహానగరం ఆర్థికంగా చాలా కీలకం. ఇక్కడ కూడా స్టాక్ మార్కెట్ లావాదేవీలు పెద్ద ఎత్తున జరుగుతాయి. పెట్టుబడిదారుల కేంద్రమిది. లక్షల మంది ఉద్యోగులు రాత్రి వేళ కూడా పనిచేస్తుంటారు. కాబట్టి వారికి ఉపయోగకరంగా ఉండేలా 24 గంటల ప్రతిపాదన ముందుకు వచ్చింది.
ఎకానమీ వృద్ధి ....
మహా నగరాల్లో పనివేళలు విభిన్నంగా ఉంటాయి. ఇక్కడ కేవలం స్థానిక కంపెనీల కోసమే కాకుండా ప్రపంచంలోని ఇతర కంపెనీల కోసం కూడా లక్షల్లో ఉద్యోగులు పనిచేస్తుంటారు. వారికి రవాణా, ఆహారం, షాపింగ్ వంటి సదుపాయాలు అర్ధ రాత్రి కూడా అవసరం అవుతాయి. మెజారిటీ జనాలకు అర్ధ రాత్రి తర్వాత పెద్దగా అవసరాలు ఉండవు. కానీ, ఐటీ, బీపీఓ వంటి రంగాల్లోని కంపెనీల్లో పనిచేసేవారికి ఎక్కువ ప్రయోజనకరం. అలాగే తయారీ రంగంలో నైట్ షిఫ్తుల్లో పనిచేసే వారికీ కూడా ఈ నిర్ణయం కలిసివస్తుంది. కానీ ముంబై లోని ఐదో వంతు కంటే తక్కువ మంది మాత్రమే అర్ధ రాత్రి దాటిన తర్వాత కూడా షాపింగ్, ఆహారం వంటి వాటికోసం చూస్తారు.
అయినప్పటికీ... స్థానిక ఆర్థిక వ్యవస్థ కొంత వృద్ధి చెందే అవకాశం ఉంటుందని ఆర్థికవేత్తలు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ముఖ్యంగా ఆహార విక్రేతలకు అధికంగా కలిసొస్తుందని చెబుతున్నారు. షాపింగ్ కూడా ఊపందుకుంటుంది. ఒకే అద్దెతో ఎక్కువ సేపు షాప్ ను నిర్వహిస్తే... కొంత ఆదాయం పెరిగే అవకాశం లభిస్తుందని రిటైలర్లు చెబుతున్నారు. అలాగే ఎక్కువ పనిగంటలు పనిచేయాలంటే ఎక్కువ మంది పని వాళ్ళు కావాలి. అంటే ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి.
ప్రస్తుతం 10 కే పరిమితం...
ముంబైలో ప్రస్తుతం అన్ని రకాల షాపులు రాత్రి 10 గంటల కల్లా మూసివేయాలి. పబ్బులు, క్లబ్బులు, బార్లు, హోటల్స్ మాత్రం రాత్రి 1:30 వరకు నడుపుకునే అవకాశం ఉంది. ఇక మీదట రాత్రి 10 గంటల వరకే నడిపే ఇతర రిటైల్ షాపులు కూడా 24 గంటలు తెరిచి ఉంచవచ్చు. ఆహార స్టాళ్లు, హోటల్స్ కూడా అంతే. కానీ బార్లు, పబ్బులు, క్లబ్బులు మాత్రం మునుపటిలా 1:30 వరకే మూసేయాల్సి ఉంటుంది. బిజినెస్ వచ్చే అవకాశం ఉన్నా పోలీస్ లకు బయపడి 10 గంటలు, అంతకంటే ముందే చాలా మంది వ్యాపారాలు కొట్లను మూసేస్తారు. దాని వల్ల రోజువారీ రాబడి తగ్గిపోతుంది. కానీ ఇకపై 24 గంటలు కాకపోయినా... అర్ధ రాత్రి వరకు షాపులు పనిచేసినా... వారి ఆదాయం 10-20% అధికంగా పెరుగుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆహార విక్రేతలకు మాత్రం 50% వరకు అధిక రాబడికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు.