షాకింగ్! అనిల్ అంబానీకి ముఖేష్ అంబానీ ఆర్థిక సాయం చేయలేదా? ఏం జరిగిందంటే...
2019లో ఎరిక్సన్ బకాయిల కేసులో తన తమ్ముడు అనిల్ అంబానీ జైలుకు వెళ్లకుండా ఆసియా కుబేరుడు ముఖేష్ అంబానీ ఆర్థికంగా ఎలాంటి సాయం అందించలేదట. అన్నదమ్ములు విడిపోయిన తర్వాత ముఖేష్ అంబానీ రోజురోజుకు తన సంపదను పెంచుకుంటూ ఆయిల్ నుండి అన్ని రంగాల్లో చక్రం తిప్పుతున్నారు. మరోవైపు అనిల్ అంబానీ ఆస్తులు కరిగిపోయాయి. ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి మూడు చైనా బ్యాంకుల వరకు వేలకోట్లు అప్పులు చెల్లించాల్సి ఉంది. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయారు. తన వద్ద ఎలాంటి ఆస్తులు లేవని ఇటీవల లండన్ కోర్టుకు తెలిపారు. ఇక గత ఏడాది ఎరిక్సన్ బకాయిల కేసులో ముఖేష్ తమ్ముడికి ఆర్థికంగా సాయం అందించలేదు.
లీజుకు ఇవ్వడం ద్వారా రుణం తీర్చారు
అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్(RCom)కు చెందిన కార్పోరేట్ ఆస్తులను ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్కు లీజుకు ఇవ్వడం ద్వారా దాదాపు రూ.460 కోట్లు తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. రిలయన్స్కు కార్పోరేట్ ఆస్తుల లీజు ద్వారా ఈ బకాయిలను చెల్లించారు అనిల్ అంబానీ. ఎరిక్సన్ కార్పోరేట్ అంశమని, ఈ అప్పులు తీర్చడం కోసం అనిల్ అంబానీ కార్పోరేట్ ఆస్తులను లీజుకు ఇచ్చారని, వాటి ద్వారా నిధులు సమీకరించారని, కానీ ముఖేష్ అంబానీ నుండి అనిల్కు వ్యక్తిగత ప్రయోజనం లేదా బహుమతిగా రాలేదని చెబుతున్నారు.
అప్పుడు ఏం చెప్పారంటే
అయితే ఏ ఆస్తిని లీజుకు తీసుకున్నారనే విషయం తెలియరాలేదు. మార్చి 18, 2019 ఆర్.కామ్. ఓ పత్రికా ప్రకటనను విడుదల చేసింది. స్వీడన్ టెలికం పరికరాల తయారీ కంపెనీ సంస్థకు రూ.458.77 కోట్ల బకాయిలు చెల్లించారు. దీంతో అనిల్ అంబానీ జైలు శిక్ష నుండి తప్పించుకున్నారు. ఆ సందర్భంలో అనిల్ అంబానీ ఓ ప్రకటన విడుదల చేశారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో తనకు అండగా నిలిచిన సోదరుడు ముఖేష్ అంబానీకి హృదయపూర్వక ధన్యవాదాలు, సకాలంలో మద్దతు ద్వారా బలమైన కుటుంబ విలువలను వ్యక్తపరిచారని, నా కుటుంబం, నేను ఎప్పటికీ మీకు రుణపడి ఉంటామని, మీ సాయం మా హృదయాలను తాకిందని అనిల్ అంబానీ నాడు పేర్కొన్నారు.
అప్పుల్లో అనిల్ కంపెనీలు
అయితే ఇప్పుడు ఏడాదిన్నర తర్వాత అనిల్ అంబానీ ఆర్.కామ్ గ్రూప్ అధికార ప్రతినిధి మాత్రం కార్పోరేట్ ఆస్తుల లీజింగ్ ద్వారా బకాయిలు చెల్లించినట్లు చెబుతున్నారు. అనిల్ అంబానీని ఆర్థిక ఉచ్చు నుండి కాపాడినప్పటికీ అది బిజినెస్ యాంగిల్లోనే అని అభిప్రాయపడుతున్నారు. ఇరువురి మధ్య సంబంధాలు అంత బాగా లేవని అంటున్నారు. అనిల్ అంబానీకి చెందిన రెండు కంపెనీలు ఆర్.కామ్, రిలయన్స్ నావల్ అండ్ ఇంజినీరింగ్ లిమిటెడ్ దివాలా ప్రక్రియలో ఉన్నాయి. ఆర్.కామ్ ఆస్తుల బిడ్డింగ్లో రిలయన్స్ జియో కూడా ఉంది. అనిల్కు చెందిన ఇతర కంపెనీలు రిలయన్స్ ఇన్ఫ్రా, రిలయన్స్ పవర్, రిలయన్స్ కాపిటల్ అప్పుల్లో కూరుకుపోయాయి. వీటి వ్యాల్యూ స్టాక్ మార్కెట్లో కేవలం రూ.1600 కోట్ల రూపాయిల.
అనిల్కు తాత్కాలిక ఊరట
యస్ బ్యాంకు ఇటీవల శాంటాక్రాజ్లోని అనిల్ అంబానీ ప్రధాన కార్యాలయానికి, దక్షిణ ముంబైలోని మరో రెండు కార్యాలయాల స్వాధీనానికి నోటీసులు పంపించింది. అంతకుముందు అనిల్ రిలయన్స్ గ్రూప్ ప్రధాన కార్యాలయాన్ని, చైర్మన్ కార్యాలయాన్ని దక్షిణ ముంబైలోని బల్లార్డ్ ఎస్టేట్లోని రిలయన్స్ సెంటర్కు మార్చవచ్చునని వార్తలు వచ్చాయి. అయితే ఆగస్ట్ నెలలో ఢిల్లీ హైకోర్టు దివాలా చర్యలపై తాత్కాలిక స్టే ఇచ్చింది. ఇది అనిల్ అంబానీకి భారీ ఊరట. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఇబ్బంది లేదు.
ప్రపంచ 6వ ధనవంతుడి నుండి అప్పుల వరకు
ఒకప్పుడు 42 బిలియన్ డాలర్లతో ప్రపంచ ఆరో ధనవంతుడుగా ఉన్న అనిల్ అంబానీ ఇప్పుడు అప్పుల్లో కూరుకుపోయారు. మూడు చైనా బ్యాంకులకు 716 మిలియన్ డాలర్లు (రూ.5,276 కోట్లు) చెల్లించాలని యూకే కోర్టు మే నెలలో ఆదేశాలు జారీ చేసింది. అయితే తన వద్ద ఏమీ లేవని, తన న్యాయపరమైన ఖర్చుల కోసం ఆభరణాలు కూడా అమ్ముకోవాల్సి వచ్చిందని, ప్రస్తుతం తన ఖర్చులు భార్య, పిల్లలు భరిస్తున్నారని లండన్ కోర్టుకు అనిల్ అంబానీ తెలిపారు. తన కొడుకు నుండి రుణం తీసుకున్నట్లు చెప్పారు.
ధీరుబాయ్ కన్నుమూశాక..
2002లో ధీరుబాయ్ అంబానీ కన్నుమూశారు. ఆ తర్వాత 2005లో ముఖేష్, అనిల్ వ్యాపారులు విడిపోయాయి. తల్లి కోకిలాబెన్ మధ్యవర్తిత్వం ద్వారా వ్యాపారాలు విభజించారు. కృష్ణా గోదావరి బేసిన్లో సహజ వాయు ఉత్పత్తికి సంబంధించి అన్నదమ్ముల మధ్య న్యాయపోరాటం సాగింది. 2010లో సుప్రీం కోర్టు తీర్పు ముఖేష్ అంబానీకి అనుకూలంగా వచ్చింది. 2010లో నాన్-కాంపీట్ ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో ఒకరి రంగాల్లోకి మరొకరు ప్రవేశించడానికి వెసులుబాటు కలిగి, 2016లో ముఖేష్ అంబానీ జియో ప్రారంభించడానికి మార్గం సుగమమైంది. 2011లో ధీరుబాయ్ 80వ జయంతి కార్యక్రమంలో కలిశారు. ఆ తర్వాత సోదరులు బహిరంగంగా ఎప్పుడూ కలవలేదు. ముఖేష్ టెలికం వ్యాపారం, డిజిటల్ పైన దృష్టి సారించారు. 2016లో మేనకోడలు వివాహం కోసం కలిశారు. 2016లో రిలయన్స్ జియఓ రాక పట్ల ఓ సమయంలో అనిల్ అంబానీ ఆనందించారు.