చైనా నష్టాలు సరే, వారు భారత్ వైపు చూడటం లేదు.. ఐదు దశాబ్దాల ర్యాలీ
ప్రముఖ ఇన్వెస్టర్ మార్క్ మొబియస్ తన ఇన్వెస్ట్మెంట్లో దాదాపు సగ భాగాన్ని అభివృద్ధి చెందుతున్న భారత్, తైవాన్ వంటి మార్కెట్ కోసం కేటాయించారు. చైనా మార్కెట్లో నష్టాల్ని పరిమితం చేయడానికి వర్ధమాన మార్కెట్కు సంబంధించి తన పెట్టుబడుల్లో దాదాపు సగం ఫండ్ను పై రెండు ఎమర్జింగ్ మార్కెట్లలో పెట్టారు. మార్క్ మొబియస్ నెలకొల్పిన మొబియస్ క్యాపిటల్ పార్ట్నర్స్ ఎల్ఎల్పీ ఎమర్జింగ్ మార్కెట్ ఫండ్స్లో 45 శాతం పెట్టుబడులను ఈ దేశాలకు కేటాయించినట్లు తెలిపారు. భారత స్టాక్ మార్కెట్ పైన మొబియస్ భారీ ఆశలు పెట్టుకున్నారు.
50 సంవత్సరాల ర్యాలీ
భారత స్టాక్ మార్కెట్ను యాభై ఏళ్ళ ర్యాలీగా అభివర్ణించారు మొబియస్. పదేళ్ల క్రితం చైనా మార్కెట్లో ఉన్న పరిస్థితి, ఇప్పుడు భారత మార్కెట్లో ఉందని తెలిపారు. హార్డ్వేర్, సాఫ్టువేర్ రంగాల్లో అత్యధికంగా పెట్టుబడులు పెట్టింది మొబియస్ క్యాపిటల్ పార్ట్నర్స్ ఎల్ఎల్పీ. చైనా మార్కెట్లలో నష్టాలను పరిమితం చేయడానికి వర్ధమాన దేశాల వైపు దృష్టి సారించింది. సెప్టెంబర్ చివరి నాటికి మొబియస్ అత్యధిక పెట్టుబడులు ఉన్న సంస్థల్లో భారత్కు చెందిన సాఫ్టువేర్ సంస్థల పర్సిస్టెంట్ సిస్టమ్స్, తైవాన్కు చెందిన చిప్ టెక్నాలజీ కంపెనీ ఇమెమోరీ టెక్నాలజీ ఉన్నాయి.
డబుల్ ధమాకా
ఈ సంవత్సరం ఈ రెండు కంపెనీల షేర్లు రెండింతల కంటే ఎక్కువగా రాణించాయి. చైనా ఈక్విటీ క్షీణత భారత్ స్టాక్ మార్కెట్లో అవకాశాలను సృష్టిస్తుందని మార్క్ మొబియస్ పేర్కొన్నారు. చైనా మార్కెట్ల నష్టాల నేపథ్యంలో ఎమర్జింగ్ మార్కెట్ల పరిస్థితి బాగోలేదని భావిస్తున్నారని, కానీ భారత్, తైవాన్ వంటి వర్ధమాన దేశాల స్టాక్ మార్కెట్లు రాణిస్తున్నాయనే విషయాన్ని వాళ్లు గుర్తించడం లేదన్నారు. రాష్ట్రాలవ్యాప్తంగా ఒకే తరహా ప్రభుత్వ విధానాలు దీర్ఘకాలంలో దేశానికి ప్రయోజనం కలిగిస్తాయన్నారు.
వాటికి భిన్నంగా...
కరోనా నేపథ్యంలో గత ఏడాది (2020) మార్చి నెలలో మార్కెట్లు భారీ నష్టాల్లో కూరుకుపోయాయి. కరోనా తగ్గడం, వ్యాక్సీనేషన్, ఆర్థిక రికవరీ నేపథ్యంలో ఆ తర్వాత మార్కెట్లు పుంజుకున్నాయి. ఎప్పటికప్పుడు సరికొత్త గరిష్టాలను తాకిన సూచీలు, ప్రస్తుతం ఆల్ టైమ్ గరిష్టానికి దగ్గరగా ఉన్నాయి. అయితే భారత స్టాక్ మార్కెట్ పైన నోమురా హోల్డింగ్స్ ఇంక్, మోర్గాన్ స్టాన్లీ అంచనాలకు భిన్నంగా మొబియస్ వైఖరి ఉంది. ఇవి భారత స్టాక్ మార్కెట్ ర్యాంకును తగ్గించాయి.