20 ఏళ్లలో రూ.196 లక్షల కోట్లకు మార్కెట్ క్యాప్! సెన్సెక్స్ను ప్రభావితం చేసిన అంశాలివే
ముంబై: సెన్సెక్స్ చరిత్రలో మొదటిసారి 50,000 పాయింట్లు దాటింది. నిన్న (గురువారం, 22 జనవరి) ఈ మార్కు దాటినప్పటికీ, చివరి గంటలో దానిని నిలుపుకోలేకపోయింది. దీంతో మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ సూచీ 42 ఏళ్ల చరిత్రలో తొలిసారి 50వేల మైలురాయిని అందుకుంది. ఈ ప్రయాణంలో హర్షద్ మెహతా, సత్యం వంటి కుంభకోణాలు చూసి, భారీగా నష్టపోయిన సందర్భాలు ఉన్నాయి. 2008-09లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం, 2020లో కరోనా వంటి సంక్షోభాలను చూసింది. అలాగే, ఆర్థిక సంస్కరణలు, జీఎస్టీ అమలు, నోట్ల రద్దు వంటి కీలక నిర్ణయాలు మార్కెట్ పైన ప్రభావం చూపాయి. 1979 ఏప్రిల్ 1న ప్రారంభమైన సెన్సెక్స్ ఎన్నో ఒడిదుడుకులతో ప్రయాణించి ఎప్పటికప్పుడు రికార్డులు సృష్టిస్తోంది.
జీవనకాల గరిష్టం
కరోనా కారణంగా 2020 మార్చి 23న సెన్సెక్స్ 26,000 దిగువకు పడిపోయి, ఇప్పుడు ఈ పది నెలల కాలంలో 50,000 పాయింట్లకు చేరుకుంది. సెన్సెక్స్ పెరుగుదల నేపథ్యంలో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ కూడా పెరుగుతోంది. గత 20 ఏళ్ళ కాలంలో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.6.12 లక్షల కోట్ల నుండి రూ.196 లక్షల కోట్లకు ఎగిసింది. ఈ రెండు
దశాబ్దాల్లో 32 రెట్లు పెరిగింది. 2001-02 ఆర్థిక సంవత్సరం చివరినాటికి బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ వ్యాల్యూ రూ.6.12 లక్షల కోట్లు. 2020-21 జనవరి 21 నాటికి ఇది రూ.196.51 లక్షల కోట్లకు పెరిగింది. 2021 జనవరి 12న రూ.197.46 లక్షల కోట్లుతో జీవనకాల గరిష్ఠస్థాయిని తాకింది.
సెన్సెక్స్ను భారీగా ప్రభావితం చేసిన అంశాలు
సెన్సెక్స్ను అత్యధికంగా ప్రభావితం చేసిన టాప్ 10లో కరోనా, జీఎస్టీ, నోట్ల రద్దు, కేంద్రంలో ఎన్డీయే, యూపీఏ గెలుపోటములు, PNB, 2జీ స్కాం, సత్యం, హర్షద్ మెహతా కుంభకోణాలు, బడ్జెట్లు, ఆర్థిక సంస్కరణలు, ముంబై బ్లాస్ట్స్, రాజీవ్ గాంధీ హత్య, పార్లమెంటుపై దాడి, కార్గిల్ యుద్ధం-భారత్ విజయం, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు
పతనం.. లాభం
కరోనా కారణంగా గత ఏడాది మార్చి 23న సెన్సెక్స్ ఏకంగా 3,934 పాయింట్లు నష్టపోయింది. ఇది అత్యంత పతనం. అలాగే గత సంవత్సరమే ఏప్రిల్ 7న ఒక్కరోజులో 2,476 పాయింట్లు పెరిగింది.
తాజాగా మార్కెట్ జూమ్కు బైడెన్ రావడం, అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు, కరోనా వ్యాక్సినేషన్, నిర్మలమ్మ బడ్జెట్ పైన అంచనాలు, విదేశీ ఇన్వెస్టర్ల నుండి పెట్టుబడుల వెల్లువ వంటివి ఉన్నాయి.