ఇరాన్-అమెరికా ఇష్యూ: భారీ లాభాల్లో మార్కెట్లు, సెన్సెక్స్ 471 పాయింట్లు అప్
ముంబై: స్టాక్ మార్కెట్లు గురువారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. అమెరికా రాకెట్ దాడిలో ఇరాన్ టాప్ కమాండర్ ఖాసీమ్ సులేమని హతమయ్యాడు. అతని మృతికి ఇరాన్ ప్రతీకారంగా ఇరాక్లోని అమెరికా సైనిక క్యాంపుపై దాడి చేసింది. ఈ ఘటనలో 80 మంది మృతి చెందినట్లుగా వార్తలు వచ్చాయి. అంతేకాదు, యూఎస్ ఎంబసీ లక్ష్యంగా కూడా దాడులు నిర్వహించింది. ఇరాక్ వదిలి అమెరికా వెళ్లిపోవాలని హెచ్చరించింది. అయితే ట్రంప్ మాత్రం శాంతి మంత్రం పటించారు. అమెరికా ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోదన్నారు. ఇరాన్కు గొప్ప భవిష్యత్ ఉండాలనుకుంటే శాంతి మార్గంలో నడవాలని హితవు పలికారు. లేదంటే మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు.
రూ.2,000 పెరిగిన బంగారం ధర! ఆ తర్వాత ట్రంప్ మాటతో...
ట్రంప్ వ్యాఖ్యలు మార్కెట్లకు ఊరటనిచ్చాయి. అందుకే బుధవారం రాత్రి ఆయన ఆ ప్రకటన చేయగానే అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పెరుగుదల నిలిచిపోయింది. అమెరికాలో బుధవారం మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి. భారత మార్కెట్లు కూడా దూసుకెళ్లాయి.
అమెరికా మార్కెట్లో డోజోన్స్ 161.41 పాయింట్లు లేదా 0.56 శాతం ఎగిసి 28,745.09కు, ఎస్ అండ్ పీ 15.87 పాయింట్లు లేదా 0.49 శాతం పెరిగి 3,253.05 వద్ద, నాస్దక్ కాంపోసిట్ 66.66 పాయింట్లు లేదా 0.67 శాతం పెరిగి 9,129.24 వద్ద నిలిచింది. జపాన్ మార్కెట్ గురువారం 1.6 శాతం లాభంతో ప్రారంభమైంది.
భారత మార్కెట్లు కూడా లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం గం.9.16 నిమిషాలకు సెన్సెక్స్ 452.41 పాయింట్లు లేదా 1.11 శాతం ఎగిసి 41,270.15 వద్ద, నిఫ్టీ 136.40 పాయింట్లు లేదా 1.13 శాతం పెరిగి 12,161.80 వద్ద ప్రారంభమైంది. ఉదయం 662 షేర్లు లాభాల్లో, 85 షేర్లు నష్టాల్లో, 24 షేర్లలో మార్పు లేదు.
సెన్సెక్స్ ఉదయం గం.10.25 నిమిషాలకు 471.56 (1.16%) పాయింట్లు ఎగిసి 41,289.30 వద్ద, నిప్టీ 141.30 (1.18%) పాయింట్లు పెరిగి 12,166.65 వద్ద ఉంది. టాప్ గెయినర్స్లో భారతీ ఇన్ఫ్రా, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా మోటార్స్, జీఎంటర్టైన్మెంట్, ఇండస్ ఇండ్ బ్యాంక్ ఉండగా, టాప్ లూజర్స్లో టీసీఎస్, కోల్ ఇండియా, హెచ్సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, బ్రిటానియా ఉన్నాయి.