బర్గర్ కింగ్ ఆరంభం అదిరింది, ఈ ఏడాది 150 రెట్లు సబ్స్క్రైబ్ ఇవే..
ముంబై: బర్గర్ కింగ్ ఇండియా లిమిటెడ్ షేర్లు సోమవారం ప్రారంభంలోనే 94 శాతం మేర పెరిగాయి. ఐపీవో ద్వారా రూ.810 కోట్ల సమీకరించాలని నిర్ణయించగా, గతవారం 156 రెట్లు ఎక్కువగా సబ్స్క్రైబ్ అయ్యాయి. నేడు (సోమవారం, 14 డిసెంబర్) ఈ స్టాక్ 94 శాతం ప్రీమియంతో ప్రారంభమైంది. బీఎస్ఈలో రూ.115.35 వద్ద ప్రారంభమైంది. ఎన్ఎస్ఈలో 88 శాతం ప్రీమియంతో రూ.112.50 వద్ద ప్రారంభమైంది. ఈ స్టాక్ అత్యధికంగా రూ.119.50ని తాకి, 99.17 శాతంగా నమోదయింది. బర్గర్ కింగ్ ఇష్యూ ధర రూ.60.
నాలుగో అతిపెద్ద ఐపీవో
ఇంటర్నేషనల్ ఫాస్ట్ఫుడ్ చైన్ దిగ్గజం బర్గర్ కింగ్ స్టాక్ ఎక్స్చేంజీలో భారీ లాభాలతో లిస్ట్ కావడం గమనార్హం. డిసెంబర్ 2వ తేదీ నుండి డిసెంబర్ 4వ తేదీ మధ్య ఐపీవోను ప్రకటించింది. ఈ ఏడాది భారత స్టాక్ మార్కెట్లో భారీగా సబ్స్క్రైబ్ అయిన నాలుగో కంపెనీ. బర్గర్ కింగ్ కంటే ముందు మెజగాన్ డాక్ షిప్బిల్డర్స్ 157.41 రెట్లు, హ్యాపీయెస్ట్ మైండ్స్ 156.65 రెట్లు, కెమ్కాన్ స్పెషాలిటీ 149.3 రెట్లు సబ్స్క్రైబ్ అయింది. బర్గర్ కింగ్ 156 రెట్లు నమోదయింది.
ఈ కంపెనీలు దుమ్మురేపాయి
మెజగాన్ అక్టోబర్ 12వ తేదీన ఐపీవో కంటే 50 శాతం ప్రీమియంతో, కెమ్కాన్ అక్టోబర్ 1వ తేదీన 115 శాతం ప్రీమియంతో, హ్యాపీయెస్ట్ మైండ్స్ టెక్నాజీస్ 111 శాతం ప్రీమియంతో లిస్ట్ అయింది. ఇప్పుడు బర్గర్ కింగ్ ఇష్యూ ధర రూ.60తో పోలిస్తే రూ.50కి పైగా లాభంతో లిస్ట్ అయింది. ఆ తర్వాత రూ.124కి ఎగిసింది. అంటే 106.58 శాతం ప్రీమియం నమోదు చేసింది.
7.44 కోట్ల షేర్లను బర్గర్ కింగ్ విక్రయించగా 1,167 కోట్ల షేర్ల కోసం బిడ్స్ దాఖయ్యాయి. రూ.60 ధరల శ్రేణిలో చేపట్టిన ఇష్యూ ద్వారా కంపెనీ రూ.810 కోట్లను సమకూర్చుకుంది. ఇష్యూ నిధులలో కొంతమేర బర్గర్ కింగ్ రెస్టారెంట్స్ పేరుతో కొత్త కంపెనీ ఏర్పాటుకు వినియోగించనుంది. అలాగే స్టోర్స్ విస్తరణకు ఉపయోగించనుంది. ఇష్యూకి ముందు రోజు కంపెనీ యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.364 కోట్లకు పైగా సమకూర్చుకుంది.
261 రెస్టారెంట్లు..
గ్లోబల్ క్యూఎస్ఆర్ చైన్ సంస్థ బర్గర్ కింగ్ దేశీయంగా 2014లో స్టోర్ను ఏర్పాటు చేసింది. ఈ అయిదేళ్లలో 51 పట్టణాల్లో 261 రెస్టారెట్లకు పెరిగాయి. మాస్టర్ ఫ్రాంచైజీ ఒప్పందాల ద్వారా బర్గర్ కింగ్ బ్రాండ్ను విస్తరిస్తోంది. అంతర్జాతీయంగా బర్గర్ బ్రాండ్లలో నెట్వర్క్ రీత్యా ఈ కంపెనీ రెండో ర్యాంకులో ఉంది. అంతర్జాతీయంగా 18,000 రెస్టారెంట్లు ఉన్నాయి. 2017లో రూ.233 కోట్లుగా ఉన్న ఆదాయం 2019 నాటికి రూ.633 కోట్లకు పెరిగింది. నష్టాలు రూ.72 కోట్ల నుంచి రూ.38 కోట్లకు తగ్గాయి. డామినోస్ పిజ్జా(జుబిలాంట్ ఫుడ్ వర్క్స్) ప్రధాన పోటీదారు. FY20లో డామినోస్ పిజ్జా మార్కెట్ వాటా 21 శాతంగా ఉంది. మెక్డొనాల్డ్ 11 శాతం, KFC 10 శాతం, సబ్-వే 6 శాతంతో ఉంది. బర్గర్ కింగ్ వాటా 5 శాతంగా ఉంది.