రెండు నెలలుగా నష్టపోయిన ఆ షేర్లకు లాక్ డౌన్ సడలింపులతో ఊపిరి.. ర్యాలీ చేసిన ఎయిర్ లైన్స్
ఆరు రోజులుగా వరుసగా ర్యాలీని కొనసాగించిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన దగ్గరనుండి ఒడిదుడుకుల మధ్య ఊగిసలాడుతూ ట్రేడింగ్ ముగిసే సరికి నష్టాలను చవిచూశాయి.అయితే ఈరోజు సెన్సెక్స్ 129 పాయింట్లు తగ్గి 33, 981 వద్ద నిలువగా,నిఫ్టీ 32 పాయింట్లు క్షీణించి 10,029 వద్ద ముగిసింది. గత ఆరు రోజులుగా 34 వేల పాయింట్లకు పైగా కొనసాగుతున్న సెన్సెక్స్ నేడు 34 వేల పాయింట్ల దిగువకు చేరుకుంది.
నష్టాల్లో ముగిన మార్కెట్ .. అయినా ర్యాలీ చేసిన ఎయిర్ లైన్స్ , మల్టీప్లెక్స్ షేర్లు
గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ ముగిసేసరికి నష్టాల బాటలో పయనించినా, తాజాగా లాక్ డౌన్ నిబంధనల సడలింపుల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లో ఎయిర్లైన్స్, మల్టీప్లెక్స్ షేర్లు లాభపడ్డాయి. ఈరోజు ఈ షేర్లు జోరుగా ర్యాలీ చేశాయి. లాక్డౌన్లో కొన్ని నిబంధనలతో కూడిన సడలింపులు ఇస్తుండడంతో ఎయిర్ లైన్స్, అలాగే మల్టీప్లెక్స్ లు తిరిగి కొనసాగుతాయన్న వార్తల నేపథ్యంలో ఎయిర్ లైన్స్ మరియు మల్టీప్లెక్స్ ల షేర్లకు కాస్త ఊపిరి వచ్చింది.
ప్రయాణాలు పుంజుకుంటాయన్న భావనలో జోరుగా ఎయిర్ లైన్స్ షేర్ల కొనుగోలు
సాధారణ పరిస్థితులు నెలకొని, త్వరలో ప్రయాణాలు పుంజుకుంటాయని ఇన్వెస్టర్లు భావిస్తుండడంతో నేడు ఎయిర్లైన్స్ షేర్ల కొనుగోలు జోరుగా జరిగింది. ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్(ఇండిగో) షేరు 9.2 శాతం లాభపడి రూ.1,117.90 వద్ద ముగిసింది. ఉదయం రూ.1,025 వద్ద ప్రారంభమైన ఈ షేరు ఒక దశలో రూ.1,125 వద్ద గరిష్టాన్ని తాకింది. మరో ఎయిర్లైన్ సంస్థ స్పైస్జెట్ 5 శాతం లాభంతో రూ.46.85 వద్ద ముగిసింది.
జూన్ తర్వాత మల్టీప్లెక్స్ లు ఓపెన్ అవుతాయన్న ఆశాభావం .. పుంజుకున్న మల్టీప్లెక్స్ షేర్లు
ఇక ఇదే సమయంలో నిన్న కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ , సినీ వర్గాలతో జరిగిన మీడియా సమావేశంలో జూన్ తర్వాత సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్ లు తెరుచుకునే అవకాశం ఉందన్న ఆశా భావంలో నేడు ఎన్ఎస్ఈలో మల్టీప్లెక్స్ షేర్లు సైతం ర్యాలీ చేశాయి.వీటిలో ముఖ్యంగా పీవీఆర్ షేరు 7 శాతం లాభపడి రూ.1,074 వద్ద ముగిసింది. ఉదయం సెషన్లో రూ.990 వద్ద ప్రారంభమైన పీవీఆర్ షేరు ఒక దశలో రూ.1,103వద్ద గరిష్టాన్ని తాకింది. మరో కంపెనీ ఐనాక్స్ లీజర్ షేరు 16 శాతం లాభపడి రూ.270 వద్ద ముగిసింది. ఉదయం ట్రేడింగ్ ప్రారంభం లో రూ.236 వద్ద ప్రారంభమైన ఈ షేరు ఒక దశలో రూ.279 వద్ద గరిష్టాన్ని చేరింది.
గత రెండునెలలుగా పతనమైన షేర్లు ..నేడు మార్కెట్ ముగిసేసరికి ఇదీ పరిస్థితి
లాక్డౌన్తో దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దవడం, సినిమాహాళ్లు మూతపడడంతో గత రెండు నెలలుగా ఈ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.ఇక తాజా లాక్ డౌన్ సడలింపులు ఇస్తున్నక్రమంలో ఈ షేర్లు కాస్త పుంజుకునే ప్రయత్నంలో ఉన్నాయి. ఇక నేడు మార్కెట్ ముగిసే సరికి ఎన్ఎస్ఈలో ప్రధానంగా మీడియా, ఫార్మా, ఐటీ, పీఎస్యూ బ్యాంక్స్ 4-1 శాతం మధ్య పుంజుకున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ, ఇండస్ఇండ్, కొటక్ మహీంద్రా, యాక్సిస్, ఎల్అండ్టీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ, బజాజ్ ఫిన్సర్వ్ 4.7-2.4 శాతం మధ్య పతనమయ్యాయి.