సెన్సెక్స్ 334..నిఫ్టీ 97 పాయింట్లు: స్వల్ప నష్టాలతో ముగిసిన మార్కెట్లు
న్యూఢిల్లీ: దేశీయ మార్కెట్లు శుక్రవారం నష్టాల బాటలో సాగాయి. ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు మంచి ఫలితాలు చూపినప్పటికీ దేశీయ మార్కెట్లు మాత్రం కుప్పకూలాయి. ఇందుకు కారణం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించిన రెపో రేట్ అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గురువారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించిన రేట్లలో రెపో రేట్లో ఎలాంటి మార్పు చేయకుండా యథాతథంగా ఉంచడంతో ఆ ప్రభావం స్టాక్ మార్కెట్లపై పడిందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు మార్కెట్ సెంటిమెంటు బలహీనపడేందుకు కారణం ఆర్థికలోటు కూడా ఒకటని వారు చెప్పారు.
ఇక సెన్సెక్స్ 334 పాయింట్లు కోల్పోయి 40వేల 445 పాయింట్ల వద్ద ముగిసింది. మరోవైపు నిఫ్టీ 97 పాయింట్లు కోల్పోయి 11921.50 వద్ద ముగిసింది. సెన్సెక్స్ పై ఉన్న హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ, ఇండస్ బ్యాంక్లు నష్టాలు చవిచూసిన వాటిలో ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ వారం మొత్తంలో 0.85 శాతం మేరా సెన్సెక్స్ నష్టాలు చూడగా నిఫ్టీ 1.19శాతం మేరా నష్టాల్లో నిలిచింది. ఇక బీఎస్ఈ నిష్పత్తి చూస్తూ 1:2గా ఉంది. అంటే ట్రేడింగ్ అయిన ప్రతి మూడు స్టాక్లకు రెండు స్టాక్స్ నష్టాలు చవిచూశాయి.
సెన్సెక్స్ ప్యాక్లో చూస్తే ఏడు స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. మిగతా స్టాక్స్ నష్టాల్లో ముగిశాయి. అన్నిటికంటే అత్యంత పతనం దిశగా పయనించింది యస్ బ్యాంక్. యస్ బ్యాంక్ 9.82శాతం మేరా నష్టపోయింది. యస్ బ్యాంకు లోటుపాట్లను ప్రముఖ ఇన్వెస్టింగ్ సంస్థ మూడీసీ ఎత్తి చూపడంతో ఒక్కసారిగా యస్ బ్యాంకు షేర్లు పతనమయ్యాయి. అంతేకాదు యస్ బ్యాంకుపై కాస్త నెగిటివ్ ప్రచారం జరగడం కూడా షేర్ల పతనానికి కారణం అని చెప్పొచ్చు. ఇక యస్ బ్యాంక్ తర్వాత లిస్టులో జాయిన్ అయిన బ్యాంకులు ఎస్బీఐ, టాటామోటార్స్, ఎం&ఎం , హెచ్డీఎఫ్సీలు ఉన్నాయి.
ఇదిలా ఉంటే కొటాక్ మహీంద్ర బ్యాంక్ 1.48 శాతంతో అత్యధిక లాభాలు పొందిన బ్యాంక్గా తొలిస్థానంలో నిలిచింది. ఆ తర్వాత టాటా స్టీల్, రిలయన్స్ , ఏషియన్ పెయింట్స్, టీసీఎస్లు నిలిచాయి. మరోవైపు ప్రభుత్వం ఆదుకోకుంటే వొడాఫోన్ ఐడియా సంస్థలను మూసివేయాల్సి ఉంటుందన్న కుమార్ మంగలం బిర్లా వ్యాఖ్యలతో ఆ సంస్థ కూడా నష్టాలు చవిచూసింది.