ఆక్సిజన్ సరఫరాలో మేము సైతం: ఎయిర్ లిఫ్ట్ ద్వారా ఆక్సిజన్ రవాణాతో రంగంలోకి దిగిన ఐటీసీ
కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ కొనసాగుతున్న నేపథ్యంలో మెడికల్-గ్రేడ్ ఆక్సిజన్ డిమాండ్ను తీర్చడానికి, ఐటిసి రంగంలోకి దిగింది. ఆసియా దేశాల నుండి 24 క్రయోజెనిక్ ఐఎస్ఓ కంటైనర్లను దేశవ్యాప్తంగా కరోనా బాధితుల ప్రాణాలను కాపాడటానికి విమానంలో రవాణా చేస్తోంది. ఐటీసీ ఈ గొప్ప ప్రయత్నం కోసం భారత సమ్మేళనం లిండే ఇండియాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.
కరోనా కష్ట కాలంలో మెడికల్ ఆక్సిజన్ అవసరాలను తీరుస్తున్న ఐటీసీ
కరోనా కష్ట కాలంలో మెడికల్ ఆక్సిజన్ అవసరాలను తీర్చటం కోసం రంగంలోకి దిగిన ఐటీసీ అదనంగా, ఆసియా దేశాల నుండి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ మరియు ఆక్సిజన్ జనరేటర్ యంత్రాలను ఎయిర్ లిఫ్ట్ చేయబోతున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ మరియు ఆక్సిజన్ జనరేటర్లను నేరుగా కోవిడ్ -19 ఆసుపత్రులలో ఏర్పాటు చేయవచ్చు. ఇప్పటికే ఐటిసి తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో ఆక్సిజన్ను సరఫరా చేస్తోంది.
ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు , ఆక్సిజన్ జనరేటర్ యంత్రాలను ఎయిర్ లిఫ్ట్ చేస్తామన్న ఐటీసీ
అవసరమైన ఆసుపత్రులకు మెడికల్-గ్రేడ్ ఆక్సిజన్ పంపిణీని ప్రారంభించడానికి సంస్థ భద్రాచలం లోని తన పేపర్ బోర్డుల కర్మాగారాన్ని ఉపయోగిస్తోంది. ఐటీసీ సంస్థ చేసిన ఒక ట్వీట్లో, "ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడానికి ఐటీసీ సంస్థ కట్టుబడి ఉందని , అభివృద్ధి చెందుతున్న సవాళ్లను పరిష్కరించడంలో సహాయపడటానికి ఇతర మార్గాలను అన్వేషిస్తూనే ఉంటుంది అని పేర్కొన్నారు.ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ల కోసం, ఐటిసి పంపిణీదారులకు ప్రత్యక్ష ఆర్డర్లు ఇచ్చింది. కోవిడ్ -19 కేంద్రాలకు కాన్సన్ట్రేటర్స్ ను దిగుమతి చేసుకుని సరఫరా చేయాలని కంపెనీ యోచిస్తోంది.
ఐటీసి మాత్రమే కాదు టాటా స్టీల్ , రిలయన్స్ కూడా రంగంలో
ఆక్సిజన్ కొరత మరియు ఇతర ప్రాథమిక కోవిడ్ -19 పోరాట సామాగ్రి కారణంగా ఉక్కిరిబిక్కిరి అవుతున్న దేశానికి మద్దతు ఇవ్వడానికి ముందుకు వచ్చిన భారతీయ కంపెనీలలో ఐటిసి ఒకటి.ఐటిసితో పాటు, టాటా స్టీల్ మరియు రిలయన్స్ కూడా దేశవ్యాప్తంగా ఆసుపత్రులకు వందల టన్నుల ఆక్సిజన్ను సరఫరా చేస్తున్నాయని తెలుస్తుంది . కరోనా మహమ్మారి పై దేశం చేస్తున్న పోరాటంలో ఈ సంస్థలు మేము సైతం అంటూ తమ వంతు పాత్రను పోషిస్తూ ప్రజల ఆక్సిజన్ అవసరాలను తీర్చడానికి యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తున్నాయి.