ఒక్కరోజులో రూ.2.08 లక్షల కోట్ల సంపద హాంఫట్: 3 రోజుల్లో 1800 పాయింట్లు..
ముంబై: ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి వారం రోజుల ముందు మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. ప్రధానంగా ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్కు మొగ్గు చూపడంతో సూచీలు వరుసగా మూడో రోజు నష్టపోయాయి. రిలయన్స్ స్టాక్ దారుణంగా పతనమైంది. రూ.5.58 శాతం లేదా రూ.114కు పైగా నష్టపోయింది. డిసెంబర్ త్రైమాసికానికి గాను ఫలితాల్లో పెట్రోరసాయనాల విభాగం ఆదాయం 30 శాతం వరకు పడిపోవడంతో ఈ కంపెనీ షేర్లు నేటి ట్రేడింగ్లో భారీగా నష్టపోయాయి.
మార్చి తర్వాత రూ.5, రూ.10, రూ.100 నోట్లు చెల్లవా? ప్రభుత్వం ఏమంటోంది
1800 పాయింట్లకు పైగా డౌన్
రెండున్నర నెలలుగా సూచీలు ఎప్పటికప్పుడు సరికొత్త గరిష్టాలను తాకుతున్నాయి. కొత్త శిఖరాలను తాకుతూనే, నష్టాలను కూడా నమోదు చేస్తున్నాయి. గత గురువారం 50వేల మార్కును క్రాస్ చేసిన సెన్సెక్స్, అదే రోజు నష్టాల్లో ముగిసింది. నాటి నుండి నేటితో వరుసగా మూడో రోజు నష్టపోయింది. ఈ మూడు రోజుల్లోనే సెన్సెక్స్ 1800 పాయింట్లకు పైగా పతనమైంది. అంతర్జాతీయ నెగిటివ్ సంకేతాలు, ఇండో-చైనా బార్డర్ ఉద్రిక్తతలు, ప్రాఫిట్ బుకింగ్ తదితరాలు మార్కెట్ నష్టాలకు కారణం.
రూ.2.08 లక్షల కోట్లు హాంఫట్
సెన్సెక్స్ 530 పాయింట్లకు పైగా నష్టపోవడంతో నేడు ఇన్వెస్టర్ల సంపద రూ.2.08 లక్షల కోట్లు హరించుకుపోయింది. దీంతో బీఎస్ఈ లిస్టెట్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.192.27 లక్షల కోట్లకు క్షీణించింది. రిలయన్స్ 5 శాతానికి పైగా నష్టపోయింది. బ్యాడ్ లోన్స్ పెరిగిన నేపథ్యంలో కొటక్ మహీంద్రా 2 శాతం కోల్పోయింది. గ్రాసీమ్ ఇండస్ట్రీస్ 6 శాతం ఎగిసిపడగా, ఏషియన్ పేయింట్స్ 3 శాతం పతనమైంది. ప్రాఫిట్ బుకింగ్ కారణంగా అల్ట్రా టెక్ సిమెంట్ 3 శాతం పడిపోయింది.
ఐపీవోలు
ఐపీవోకు వచ్చిన హోమ్ ఫైనాన్స్ 25 రెట్లు సబ్స్క్రైబ్ అయ్యారు. స్టోవ్ క్రాఫ్ట్ 0.77 శాతం రెట్లు సబ్స్కైబ్ అయింది. టాప్ గెయినర్స్ జాబితాలో యూపీఎల్, సిప్లా, హీరో మోటో కార్ప్, యాక్సిస్ బ్యాంకు, జేఎస్డబ్ల్యు స్టీల్, బజాజ్ ఆటో, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, సన్ ఫార్మా, బజాజ్ ఫిన్ సర్వ్ ఉన్నాయి.