ఒక్కరోజులో రూ.3.5 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరి
స్టాక్ మార్కెట్లు బుధవారం (మార్చి 17) భారీ నష్టాల్లో ముగిశాయి. నేడు ఉదయం స్వల్పంగా లాభపడి 50,436 పాయింట్ల వద్ద ప్రారంభమైనప్పటికీ, ఆ తర్వాత నష్టాల్లోకి వెళ్లింది. ఓ దశలో కోలుకున్నట్లు కనిపించినా కాసేపటికే భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్ 562.34 (1.12%) పాయింట్లు నష్టపోయి, 49,801.62 పాయింట్ల వద్ద, నిఫ్టీ 189.15 (1.27%) పాయింట్లు క్షీణించి 14,721.30 పాయింట్ల వద్ద ముగిసింది.
మార్కెట్లు భారీగా నష్టపోవడంతో ఇన్వెస్టర్లు నేడు ఒక్కరోజే 3.5 లక్షల కోట్లు నష్టపోయారు. అధిక వెయిట్ కలిగిన రిలయన్స్, HDFC బ్యాంకు, ICICI బ్యాంకు నష్టపోవడంతో సూచీలు మరింత కుంగాయి. అమెరికా ఫెడ్ రిజర్వ్ పాలసీ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లు బలహీనంగా ఉన్నాయి. సూచీలు వరుసగా నాలుగు రోజులు నష్టాల్లో ముగిశాయి. ఈ నాలుగు రోజుల్లో ఇన్వెస్టర్ల రూ.5.5 లక్షల సంపద కరిగిపోయింది.
అమెరికా యీల్డ్స్ 13 నెలల గరిష్టాన్ని తాకాయి. అదే సమయంలో స్టాక్స్ నష్టాల్లో ముగిశాయి. 30 షేర్ ప్యాక్ సెన్సెక్స్లో 26 కంపెనీలు నష్టాల్లో ముగిశాయి. అన్ని కీలక రంగాల షేర్లు కూడా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు రెండు కూడా 2 శాతం మేర క్షీణించాయి.