ఈ ఒక్కరోజులో రూ.2.23 లక్షల కోట్ల సంపద హుష్కాకి
ముంబై: స్టాక్ మార్కెట్లు నేడు భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్ 549.49 పాయింట్లు లేదా 1.11% క్షీణించి 49,034.67 పాయింట్ల వద్ద, నిఫ్టీ 161.90 పాయింట్లు లేదా 1.11% క్షీణించి 14,433.70 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. గత కొద్ది రోజులుగా మార్కెట్లు ఎప్పటికప్పుడు సరికొత్త శిఖరాలను తాకుతున్నాయి. అయితే జోబిడెన్ ప్రకటించిన అమెరికా ఆర్థిక ప్యాకేజీ మెప్పించకపోవడం, ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడంతో నేడు సూచీలు నేలచూపులు చూశాయి. నేడు ఇన్వెస్టర్లు భారీగా నష్టపోయారు.
4 వారాల్లో అతిపెద్ద పతనం, ఇన్వెస్ట్ చేస్తున్నారా.. కాస్త జాగ్రత్త!
రూ.2.23 లక్షల కోట్ల నష్టం
సెన్సెక్స్ భారీగా పతనం కావడంతో ఇన్వెస్టర్లు ఈ ఒక్కోరోజే రూ.2.23 లక్షల కోట్లు నష్టపోయారు. బీఎస్ఈ సెన్సెక్స్ 30 స్టాక్స్ 550 పాయింట్లు నష్టపోయాయి. ఓ సమయంలో ఏకంగా 800 పాయింట్ల వరకు నష్టపోయింది. చివరకు 550 పాయింట్లు కోల్పోయింది. చివరకు రూ.2,23,012.44 కోట్లు క్షీణించి రూ.1,95,43,560.22 కోట్లకు పడిపోయింది.
టాప్ లూజర్స్..
సెన్సెక్స్లో టాప్ లూజర్గా టెక్ మహీంద్రా నిలిచింది. ఆ తర్వాత హెచ్సీఎల్ టెక్, ఆయిల్ అండ్ నేచరల్ గ్యాస్ కార్పోరేషన్, ఏషియన్ పేయింట్స్ కూడా భారీగానే నష్టపోయాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 1.25 శాతం మేర క్షీణించాయి. నేడు లాభపడిన రంగాల్లో టెలికం మాత్రమే 3.68 శాతం లాభపడ్డాయి. బీఎస్ఈలో 1,946 కంపెనీలు నష్టపోయాయి. 1080 షేర్లు లాభాల్లో ముగిశాయి. 137 షేర్లలో ఎలాంటి మార్పులేదు.
టాప్ టెన్ కంపెనీలు..
బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,95,43,560.22 కోట్లకు పడిపోయింది. టాప్ 10లో మార్కెట్ క్యాప్ పరంగా వరుసగా రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.1228330.03, టీసీఎస్ రూ.1213371.12 కోట్లు, హెచ్డీఎఫ్సీ రూ.807615.27 కోట్లు, ఇన్ఫోసిస్ రూ.572957.16 కోట్లు, హెచ్యూఎల్ రూ.552592.14 కోట్లు, హెచ్డీఎఫ్సీ రూ.473801.61 కోట్లు, ఐసీఐసీఐ బ్యాంకు రూ.374745.94 కోట్లు, కొటక్ మహీంద్ర రూ.369082.01 కోట్లు, భారతీ ఎయిర్ టెల్ రూ.328697.33 కోట్లు, బజాజ్ ఫైనాన్స్ రూ.294156.02 కోట్లుగా ఉంది.