నష్టాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు, పెయింట్స్ స్టాక్స్పై క్రూడ్ ప్రభావం
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం(జూన్ 9, 2022) నష్టాల్లో ప్రారంభం అయ్యాయి. నిన్నటి వరకు వరుసగా నాలుగు రోజుల పాటు నష్టాల్లో ముగిసిన సూచీలు, ఈ రోజు కూడా అదే ఒరవడితో కనిపిస్తున్నాయి. ఆర్బీఐ వడ్డీ రేటు పెంపు అంచనాలు, ప్రకటన నేపథ్యంలో నాలుగు రోజులుగా సూచీలు అప్రమత్తంగా కదలాడుతూ, నష్టాల్లో కనిపించాయి. ఆర్బీఐ రెపో రేటు పెంపు అంచనాలకు అనుగుణంగా ఉండటంతో సూచీలు లాభాల్లో లేనప్పటికీ, నేడు స్వల్ప నష్టాల్లో ట్రేడింగ్ను ప్రారంభించాయి. నేడు ఊగిసలాటలో ఉన్నాయి.
సెన్సెక్స్ ఉదయం 54,514 పాయింట్ల వద్ద ప్రారంభమై, 54,812 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 54,507 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 16,263 పాయింట్ల వద్ద ప్రారంభమై, 16,336 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 16,243 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. ఉదయం గం.10.30 సమయానికి సెన్సెక్స్ 7 పాయింట్లు నష్టపోయి 54,884 పాయింట్ల వద్ద, నిఫ్టీ 13,356 పాయింట్ల వద్ద స్థిరంగా ఉంది.
రంగాలవారీగా చూస్తే ఫార్మా మినహా అన్ని రంగాలు కూడా నష్టాల్లో ఉన్నాయి. దాదాపు అన్ని స్టాక్స్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. నేటి టాప్ గెయినర్స్ జాబితా విషయానికి వస్తే డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఓఎన్జీసీ, రిలయన్స్, కోల్ ఇండియా, బజాజ్ ఆటో, ఉండగా, టాప్ లూజర్స్ జాబితాలో టాటా స్టీల్, శ్రీ సిమెంట్స్, ఏషియన్ పేయింట్స్, గ్రాసీమ్, అపోలో హాస్పిటల్స్ ఉన్నాయి.
బ్రెంట్ క్రూడాయిల్ ధరలు భారీగా పెరిగాయి. దీంతో పెయింట్ స్టాక్స్ పైన ప్రతికూల ప్రభావం పడింది. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 124 డాలర్లకు చేరుకుంది. మూడు నెలల కాలంలో ఇదే గరిష్టం. వరల్డ్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ బ్యారెల్కు 122 డాలర్ల వద్ద ఉంది. మరోవైపు డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ 77.61 వద్ద ట్రేడ్ అయింది.