ఊగిసలాట.. భారీ నష్టాల్లో మార్కెట్లు, అదరగొట్టిన ఐటీ స్టాక్స్
ముంబై: స్టాక్ మార్కెట్లు గురువారం(సెప్టెంబర్ 17) నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం గం.9.19 సమయానికి సెన్సెక్స్ 251.61 పాయింట్లు(0.64 శాతం) నష్టపోయి 39,051.24 వద్ద, నిఫ్టీ 66.60 పాయింట్లు(0.57 శాతం) క్షీణించి 11,537.90 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. అయితే ఆ తర్వాత సెన్సెక్స్, నిఫ్టీ నష్టం తగ్గినట్లుగానే కనిపించినా తిరిగి మళ్లీ భారీ నష్టాల్లోకి వెళ్లింది.
ఓ సమయంలో వంద పాయింట్లకు దిగువ నష్టానికి చేరుకొని, తిరిగి 200 పాయింట్ల నష్టానికి చేరుకుంది. బ్యాంక్ నిఫ్టీ, ఫార్మా ఇండెక్స్ నష్టాల్లో ఉన్నాయి. మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు కూడా నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. డాలర్ మారకంతో నిన్న బలపడిన రూపాయి ఈ రోజు 12 పైసలు క్షీణించి 73.74 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. అంతకుముందు సెషన్లో 73.52 వద్ద క్లోజ్ అయింది.
SBI ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తున్నారా, సెప్టెంబర్ 18 నుండి కొత్త రూల్... తెలుసుకోండి
డాక్టర్ రెడ్డీస్ జూమ్
రష్యా వ్యాక్సీన్ కోసం ఆర్డీఐఎఫ్తో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో ఈ ఫార్మా షేర్ యాక్టివ్లో ఉంది. యాక్టివ్ షేర్లలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, రిలయన్స్, హెచ్సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, టీసీఎస్ ఉన్నాయి. టాప్ గెయినర్స్ జాబితాలో హెచ్సీఎల్ టెక్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, జీ ఎంటర్టైన్మెంట్, టెక్ మహీంద్ర, విప్రో ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో హిండాల్కో, పవర్ గ్రిడ్ కార్పోరేషన్, టాటా మోటార్స్, శ్రీ సిమెంట్స్, ఐటీసీ ఉన్నాయి.
ఐటీ స్టాక్స్ అదుర్స్
ఐటీ స్టాక్స్ భారీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. మధ్యాహ్నం గం.11.15 సమయానికి ఇన్ఫోసిస్ షేర్ ధర రూ.1,000 దాటింది. ఈ రోజు 0.52 శాతం ఎగిసి రూ.1,007 వద్ద ట్రేడ్ అయింది. విప్రో షేర్ ధర 0.83 శాతం పెరిగి రూ.315 వద్ద టేర్డ్ అయింది. హెచ్సీఎల్ టెక్ షేర్ ధర 2 శాతం ఎగిసి రూ.805 పలికింది. టెక్ మహీంద్రా షేర్ 1 శాతం పెరిగి రూ.800 వద్ద ట్రేడ్ అయింది. ఐటీ స్టాక్స్లలో కేవలం టీసీఎస్ షేర్ ధర మాత్రమే 0.83 శాతం క్షీణించింది. ఈ రోజు లిస్టింగ్ అయిన హ్యాపీయెస్ట్ మైండ్స్ టెక్నాలజీస్ షేర్ ధర రూ.375 వద్ద ట్రేడ్ అయింది. ఇష్యూ ధర రూ.166 కాగా, ప్రారంభంలో దాదాపు రెండింతల కంటే ఎక్కువ పెరిగి రూ.395 వద్ద ట్రేడ్ అయింది.
ఆసియా మార్కెట్లు నష్టాల్లో.. కారణాలు ఇవే..
అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. నాస్డాక్, ఎస్ అండ్ పీ వరుసగా 0.46 శాతం, 1.25 శాతం మేర నష్టపయాయి. యూరోపియన్ మిశ్రమంగా ఉన్నాయి. ఈ ప్రభావం ఆసియా మార్కెట్లపై పడింది. నిఫ్టీ, నిక్కీ, స్ట్రెయిట్స్ టైమ్స్, హ్యాంగ్ షెంగ్, తైవాన్ వెయిటెడ్, కోప్సి, సెట్ కాంపోసిట్, జకర్తా కాంపోసిట్, షాంఘై కాంపోజిట్ అన్ని కూడా నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. వడ్డీ రేట్లను 2023 వరకు ఇలాగే కొనసాగిస్తామని ఫెడ్ రిజర్వ్ ప్రకటించడంతో ఆ ప్రభావం ఈక్విటీలపై పడింది. దాదాపు ఆసియా మార్కెట్లు మొత్తం నష్టాల్లో ఉన్నాయి.