సరికొత్త రికార్డుకు సెన్సెక్స్, నిఫ్టీ: సెన్సెక్స్ మూడ్రోజుల్లో 1800 పాయింట్లు జంప్
ముంబై: స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు భారీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. దాదాపు ఈ మూడు సెషన్లలో సెన్సెక్స్ దాదాపు 1800 పాయింట్లు లాభపడింది. ఈ వారం ప్రారంభం సోమవారం 363 పాయింట్లు, నిన్న 872 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ రెండు రోజుల్లో దాదాపు 1300 ఎగిసిపడింది. నేడు ఓ సమయంలో 600 పాయింట్లకు పైగా లాభపడింది. మధ్యాహ్నం గం.12 సమయానికి సెన్సెక్స్ 420 పాయింట్ల లాభంతో ఉంది. నిఫ్టీ 130 పాయింట్లు ఎగిసిపడింది. సెన్సెక్స్ మొదటిసారి 54,000 పాయింట్లు క్రాస్ చేయగా, నిఫ్టీ 16,300 పాయింట్ల సమీపానికి చేరుకుంది. తద్వారా సూచీలు సరికొత్త రికార్డుకు చేరుకున్నాయి.
ఉదయం ప్రారంభంలోనే సెన్సెక్స్ 425 పాయింట్ల లాభపడి 54,249 వద్ద, నిఫ్టీ 118 పాయింట్లు లాభపడి 16,249 వద్ద ట్రేడ్ అయ్యాయి. దీంతో తొలిసారి 54వేల మార్కును దాటిన సెన్సెక్స్, నిన్న 16,000 పాయింట్లతో కొత్త మైలురాయిని దాటి దూసుకెళ్తున్న నిఫ్టీ ఆల్ టైమ్ రికార్డును తాకింది. డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ రూ.74.17 వద్ద ట్రేడ్ అయింది.
అమెరికా మార్కెట్లు మంగళవారం లాభాలతో ముగిశాయి. ఆసియా-పసిఫిక్ మార్కెట్లు సానుకూలంగా కదలాడాయి. వీటికి తోడు దేశీయంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి కావొస్తుండటం, ఆటో సేల్స్ భారీగా పుంజుకోవడం, సానుకూల త్రైమాసిక ఫలితాలు, తయారీ కార్యకలాపాల వంటి అంశాలు ఇన్వెస్టర్లలో విశ్వాసం నింపాయి. కీలక కంపెనీలు రాణించడం సూచీలకు దన్నుగా నిలిచాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్లో HDFC, ఐసీఐసీఐ బ్యాంకు, ఎస్బీఐ, టాటా స్టీల్, HDFC బ్యాంకు ఉన్నాయి. మధ్యాహ్నం సమయానికి టాప్ గెయినర్స్ జాబితాలో HDFC 4.32 శాతం, ICICI Bank 3.09 శాతం, కొటక్ మహీంద్రా బ్యాంకు 2.47 శాతం, HDFC బ్యాంకు 2.27 శాతం, యాక్సిస్ బ్యాంకు 1.75 శాతం లాభపడ్డాయి. టాప్ లూజర్స్ జాబితాలో గ్రాసీమ్ 1.97 శాతం, సన్ ఫార్మా 1.64 శాతం, టాటా కన్స్యూమర్ ప్రోడక్ట్స్ 1.13 శాతం, నెస్ట్లే 1.04 శాతం, టాటా మోటార్స్ 0.99 శాతం నష్టపోయాయి.