Stock Market: వచ్చే వారం స్టాక్ మార్కెట్ గమనంపై నిపుణుల మాటేంటంటే..
Stock Market: ప్రస్తుతం దేశీయ స్టాక్ మార్కెట్లు బుల్ ర్యాలీని కొనసాగిస్తున్నాయి. అంతర్జాతీయ ఇన్వెస్టర్లు మందగమనం సమయంలో తమ పెట్టుబడులను భారత మార్కెట్లోకి తరలించటం కూడా దీనికి కారణంగా నిలుస్తోంది. నిపుణుల అంచనా ప్రకారం ఈ ప్రవాహం మరికొంత కాలం కొనసాగుతుందని తెలుస్తోంది. దీనికి తోడు యూఎస్ ఫెడ్ తన వడ్డీ రేట్ల పెంపు స్పీడ్ తగ్గించనున్న చెప్పటం కూడా మార్కెట్లలో జోష్ నింపింది.
దూసుకుపోతున్న సూచీలు..
గరిష్ఠాల వద్ద సూచీలు.. బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ ప్రస్తుతం గరిష్ఠ స్థాయిలకు చేరువలోనే కొనసాగుతోంది. బ్యాంకింగ్, ఆటోమెుబైల్ రంగాల్లోని షేర్ల పెరుగుదల దీనికి దోహదపడింది. ఈ కారణాల నేపథ్యంలో ఈ వారం నిఫ్టీ సూచీ 18400-18800 మధ్య స్థాయిలో కొనసాగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. బ్యాంక్ నిఫ్టీ సైతం బుల్ జోరును కొనసాగిస్తుందని చెబుతున్నారు.
ఐటీ-బ్యాకింగ్ స్టాక్స్..
ఈ వారం ఐటీ, బ్యాంకింగ్ రంగాలు బలంగా ముందుకు సాగనున్నట్లు కనిపిస్తోంది. అయితే వీటిలో ఇన్వెస్ట్ చేసే ముందు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఐటీ రంగంలో అట్రిషన్ రేట్లు పెరుగుతాయని తెలుస్తోంది. మరోపక్క ద్రవ్యోల్బణ కట్టడి చర్యల్లో భాగంగా పెంచుతున్న వడ్డీ రేట్లతో బ్యాంకింగ్ స్టాక్స్ లో బుల్ జోరు నెలకొంది. ఈ రంగాల్లో వృద్ధి మార్కెట్ల పురోగమనానికి దారితీయవచ్చని తెలుస్తోంది. ఇప్పటికే చాలా బ్యాంకింగ్ స్టాక్స్ గత కొంత కాలంగా భారీగా పెరుగుతున్నాయి.
స్మాల్ అండ్ మిడ్ క్యాప్ రంగాలు..
రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, సిమెంట్ రంగాల్లోని కంపెనీల్లో ర్యాలీ ఉండవచ్చని తెలుస్తోంది. దీనికి తోడు స్మాల్ అండ్ మిడ్ క్యాప్ రంగాల్లోని షేర్లు మంచి బుల్ రన్ చూడవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. మెుత్తానికి ఈ వారం సైతం మార్కెట్లు మంచి జోష్ కొనసాగిస్తాయని తెలుస్తోంది. అయితే గరిష్ఠాల వద్ద ట్రేడ్ అవుతున్నందున ఇన్వెస్టర్లు కొంత జాగ్రత్తగా ట్రేడ్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.