కరోనా వైరస్ దెబ్బ: 1% జీడీపీ ఉఫ్!
ప్రపంచం మొత్తాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ దెబ్బకు భారత ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా ప్రభావితం కాబోతోంది. ఈ మహమ్మారి రాకతో దేశంలో అన్ని రంగాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా దెబ్బతింటున్నాయి. స్కూళ్ళు, కాలేజీలు, మాల్స్, సినిమా హాళ్లు సహా రద్దీ అధికంగా ఉండే ప్రదేశాల కార్యకలాపాలు నిలిచిపోయాయి. సాఫ్ట్ వేర్ రంగంతో మొదలైన వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ క్రమంగా ఇతర రంగాలకు విస్తరిస్తోంది. తాజాగా మీడియా రంగంలో కూడా ఈ పని సంస్కృతీ మొదలైనట్లు వార్తలు వెలువడ్డాయి. అన్నీ బంద్ అయిపోయి... జనాలు ఇండ్లకే పరిమితమైతే... దేశంలో వినియోగం ఘోరంగా దెబ్బతింటుంది. తద్వారా ఎకానమీ వృద్ధి రేటు మందగిస్తుంది. ఇప్పటికే రెండేళ్లుగా ఇండియాలో ఆర్థిక మందగమనం కొనసాగుతోంది. కార్ల అమ్మకాలు నేల చూపులు చూస్తున్నాయి. పారిశ్రామిక ప్రగతి పడకేసింది. ఇప్పుడేమో కరోనా వైరస్ కారణంగా మరోసారి భారత ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభాన్ని చవిచూడబోతోంది.
'కరోనా' ఎఫెక్ట్: పర్యాటకం ఢమాల్.. విమానయాన సంస్థల 'తాయిలాలు'
3 నెలలు దాటితే కష్టమే..
ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులు మరో 2-3 నెలల్లో సర్దుకోవాలి. లేదంటే మన ఆర్థిక వ్యవస్థ 1% వరకు పడిపోయే అవకాశం ఉందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రముఖ రేటింగ్ సంస్థ కేర్ అధ్యయనంలో కూడా ఇదే తేలింది. వివిధ రంగాలకు చెందిన సీఈఓ లు, ఉన్నతాధికారులతో నిర్వహించిన ఒక సర్వే ప్రకారం వారంతా వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 1% మేరకు తగ్గుతుందని చెప్పారు. అది కూడా కేవలం కరోనా వైరస్ ప్రభావంతోనే జరగనుందని అంచనా వేశారు. అదే జరిగితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం లో ఎలాగూ స్లోడౌన్ వల్ల జీడీపీ 4% కంటే తక్కువగా నమోదవుతోంది. కానీ, 2021 నాటికీ పరిస్థితులు చక్కబడి ఇండియన్ జీడీపీ 6-7% వరకు పెరిగే అవకాశం ఉందని భావించారు. కానీ, కరోనా దెబ్బకు అది 5% చేరుకునే అవకాశాలు కూడా లేవని స్పష్టం అవుతోంది. ఇప్పటికే ఎగుమతులు, దిగుమతులు తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి. తయారీ రంగం నెమ్మదిస్తే ఉద్యోగాలు కూడా తగ్గిపోతాయి. అది సంక్షోభాన్ని మరింతగా పెంచేస్తుందని అంచనా వేస్తున్నారు.
5 ట్రిలియన్ డాలర్లు అనుమానమే..
ప్రధాని నరేంద్ర మోడీ లక్ష్యంగా పెట్టుకున్న 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగటం భారత్ కు ఇప్పుడున్న పరిస్థితిలో సాధ్యం కాకపోవచ్చు. దేశం మీద, ఆర్థిక వ్యవస్థ మీద అంతర్గత, అంతర్జాతీయ ప్రభావం అధికంగా పడింది. నోట్ల రద్దు, జీఎస్టీ అమలు తో మొదలైన ఆర్థిక సంక్షోభం ఇటీవల గ్లోబల్ ట్రేడ్ వార్ తో మరింత అధికమైంది. కానీ ఇప్పుడు కరోనా వైరస్ ముసలంతో మన మూలాలు కూడా కదిలే ప్రమాదం నెలకొంది. కరోనా వైరస్ కేసులు మన దేశంలో తక్కువగానే ఉన్నప్పటికీ... దాన్ని అరికట్టేందుకు ప్రభుత్వాలు తీసుకునే చర్యల కారణంగా జీడీపీ వృద్ధి రేటు మందగించనుంది. ప్రజల ప్రాణాలు కాపాడటమే ప్రభుత్వాల ప్రధమ కర్త్యవ్యం కాబట్టి, వాటిని తప్పుపట్టలేం.
ఫార్మా, హెల్త్ కేర్ కు పండగ.. పర్యాటకం దండగ..
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా దేశంలో తొలుత పర్యాటక రంగంపై ప్రభావం పడింది. దేశంలోనూ, విదేశీ ప్రయాణాలు తగ్గుముఖం పట్టాయి. దీనిపై ఆధారపడిన ఆతిథ్య రంగనిదీ ఇదే పరిస్థితి. రవాణా రంగం కూడా తీవ్రంగా దెబ్బతింటోంది. ముఖ్యంగా ఎయిర్లైన్స్ సంస్థలు తీవ్రంగా నష్టపోతాయి. అయితే, ప్రస్తుత సంక్షోభంలో కూడా కొన్ని రంగాలకు మేలు జరగనుంది. అవి ఫార్మా, హెల్త్ కేర్ రంగాలు. కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు, అది రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకునేందుకు ప్రజలు రకరకాల మందులు, మాస్కులు, శానిటైజెర్ల పై ఆధారపడతారు. ఇక చికిత్స కోసం హాస్పిటల్స్ కు వెళతారు. ఏ చిన్న జబ్బు వచ్చినా క్షుణ్ణంగా పరీక్షలు జరపాలని కోరతారు. దీంతో ఫార్మా కంపెనీలు, ఆస్పత్రుల ఆదాయాలు పెరుగుతాయి. ఇక చాలా మంది ఇంటి పట్టునే ఉంటారు కాబట్టి... ఫుడ్ వినియోగం పెరుగుతుంది. ఆయా ఉత్పత్తులను విక్రయించే ఎఫ్ ఎం సి జి రంగానికి ఇది కొంత మేలు చేయనుంది.