ధనతెరాస్ అమ్మకాలు ఎలా ఉన్నాయంటే: గోల్డ్ కాయిన్స్, చిన్న ఆభరణాల కొనుగోళ్లు జిగేల్
ముంబై: అధిక ధరలు, కరోనా మహమ్మారి కారణంగా ధనత్రయోదశి (ధన్తెరాస్) పర్వదినం సమయంలో బంగారం సేల్స్ అంత ఆశాజనకంగా కనిపించలేదు. అయితే కొనుగోలుదారులు రూటుమార్చారు! శుక్రవారంతో ముగిసిన ధనత్రయోదశి రోజున పసిడి, వెండి అమ్మకాలు గత ఏడాదితో పోలిస్తే 35 శాతం క్షీణించాయి. పసిడి, వెండి ధరలు పెరగడంతో పాటు కరోనా దెబ్బతో కుప్పకూలిన ఆర్థిక పరిస్థితులు ఇందుకు ప్రధాన కారణంగా బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
ఆర్థిక పరిస్థితులు తలకిందులు కావడంతో కొనుగోలుదారులు కాస్త రూటు మార్చి బంగారు, వెండి నాణేల వైపు ఎక్కువగా మొగ్గు చూపారు. అలాగే చిన్న చిన్న నగలక పరిమితమయ్యారు.
నాణేల కొనుగోళ్లకు మొగ్గు
బంగారు, వెండి నాణేల కొనుగోళ్ళ నేపథ్యంలో అధిక ధరలు ఉన్నప్పటికీ ధనత్రయోదశి అమ్మకాలు కాస్త సంతృప్తికరంగ ఉన్నట్లు అమ్మకందారులు చెబుతున్నారు. కరోనా, డబ్బులు పొదుపు చేయడంపై దృష్టి సారించిన ప్రజలు బంగారం నాణేలు, తేలికపాటి ఆభరణాలు కొనుగోలు చేశారు. ముందుగానే ఆర్డర్ చేసిన చాలామంది శుక్రవారం ధనత్రయోదశి రోజున డెలివరీ తీసుకున్నారు. ఆన్లైన్లో కొనుగోళ్లు కూడా గతంలో కంటే పెరిగాయి. జ్యువెల్లరీ దుకాణాలకు వచ్చిన వారి సంఖ్య ఎక్కువగా ఉందని, పూర్తి సమాచారం రావాల్సి ఉందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తెలిపింది.
వీటిపై పెట్టుబడి..
10 గ్రాముల బంగారం ధర రూ.51,000కు చేరుకోవడం, కిలో వెండి రూ. 63వేలు దాటడంతో కొనుగోలుదారులు అప్రమత్తంగా వ్యవహరించారు. గత ఏడాదితో పోలిస్తే పసిడి ధరలు 30 శాతానికి పైగా పెరిగాయి. ధనత్రయోదశి రోజు డెలివరీ తీసుకోవడానికి ఆన్లైన్ ద్వారా ముందే పసిడి, వెండి నాణేలను, ఆభరణాలను ఎంతోమంది బుక్ చేసుకున్నారు. పెట్టుబడులపై దృష్టి సారించిన మరికొంతమంది గోల్డ్ ఈటీఎఫ్, సావరీన్ గోల్డ్ బాండ్స్ కొనుగోలు చేశారు.
బంగారం కంటే వెండి
గత ఏడాదితో పోలిస్తే ఆయా ప్రాంతాల్లో విక్రయాలు 30 శాతం నుండి 50 శాతం వరకు తగ్గినట్లు చెబుతుననారు. ఈసారి ధనతెరాస్ సమయంలో కొనుగోలుదారులు బంగారం కంటే వెండి కొనుగోళ్లకు ఎక్కువగా మొగ్గు చూపారు. మొత్తం అమ్మకాల్లో పసిడి వాటా 30 శాతం వరకు ఉంటుందని అంచనా. వెండి నాణేలు, దీపాలు వంటి సామాగ్రి ఎక్కువగా అమ్ముడుపోయింది. బంగారం విషయానికి వస్తే ఎక్కువగా కాయిన్స్ కొనుగోలు చేశారు. 0.2 నుండి 2 గ్రాముల వరకు నాణేలను ఎక్కువగా కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు.