ఆంధ్రప్రదేశ్ సహా రాష్ట్రాలకు కేంద్రం రూ.6వేల కోట్ల పరిహారం
కరోనా వైరస్ కారణంగా గత 8 నెలలుగా గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్(GST) కలెక్షన్లు భారీగా క్షీణించాయి. జీఎస్టీ పరిహారానికి సంబంధించి రూ.6వేల కోట్ల మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలకు ట్రాన్సుఫర్ చేస్తోంది. నిధులు ట్రాన్సుఫర్ అయ్యే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. ప్రత్యేక రుణాలు తీసుకునే ప్రణాళికలో భాగంగా రెండో దఫా జీఎస్టీ పరిహారాన్ని కేంద్రం ఇస్తోంది.
ఈ మొత్తాన్ని 4.42 శాతం వడ్డీ రేటుతో కేంద్రం రుణంగా తీసుకుంది. ఆంధ్రప్రదేశ్తో పాటు అసోం, బీహార్, గోవా, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మేఘాలయ, ఒడిశా, తమిళనాడు, త్రిపుర, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్తో పాటు కేంద్రపాలిత ప్రాంతాలైన ఢిల్లీ, పుదుచ్చేరి, జమ్ము కాశ్మీర్లకు ఈ మొత్తాన్ని పంపించినట్లు ఆర్థిక శాఖ తెలిపింది. ప్రత్యేక విండో కింద ఆర్థిక మంత్రిత్వ శాఖ కేటాయించిన రూ.12,000 కోట్లలో ఈ చెల్లింపులు చేస్తోంది.
కాగా, అక్టోబర్ నెలలో జీఎస్టీ వసూళ్లు లక్ష కోట్లు దాటాయి. మార్చి చివరి వారంలో లాక్ డౌన్ ప్రకటించిన అనంతరం జీఎస్టీ వసూళ్లు భారీగా పుంజుకొని, లక్ష కోట్లు దాటడం ఇదే మొదటిసారి. కరోనా కారణంగా మార్చి నుండి లాక్ డౌన్ కారణంగా ఆర్థిక కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. మే లేదా జూన్ నుండి క్రమంగా కోలుకుంటున్నాయి. కార్యకలాపాలు ప్రారంభమైనప్పటికీ ఆశాజనకంగా కనిపించలేదు. సెప్టెంబర్ నెలలో జీఎస్టీ కలెక్షన్లు కాస్త పుంజుకున్నప్పటికీ, అక్టోబర్ నెలలో మరింత వేగం కనిపించింది.