బంగారాన్ని బయటకు తెచ్చేదెట్టా... సర్కారు మనసులో ఏముంది?
మన దేశంలో బంగారం వినియోగం క్రమంగా పెరుగుతూనే ఉంది. ఆభరణాల కోసం కొంత మంది, పెట్టుబడి ఉద్దేశంతో కొంత మంది బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారు. ధరలు పెరిగినప్పుడు డిమాండ్ కాస్త తగ్గినా తర్వాత మళ్ళీ పెరుగుతోంది. పసిడి వినియోగాన్ని తగ్గించడానికేకాకుండా కుటుంబాల వద్ద నిరుపయోగంగా ఉన్న బంగారాన్ని ఉపయోగకరంగా మార్చే దిశగా ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ ఇవి ఆశించిన స్థాయిలో ఫలితాలను అందించడం లేదని గణాంకాల ద్వారా తెలుస్తోంది.
మన దేశానికి వార్షికంగా 800-900 టన్నుల బంగారం విదేశాల నుంచి దిగుమతి అవుతోంది. ధరలు పెరుగుతున్న కారణంగా బంగారం కోసం అధిక మొత్తంలో విదేశీ మారక నిల్వలను వినియోగించాల్సి వస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకొనే ప్రభుత్వం బంగారం నగదీకరణ పథకాన్ని ప్రారంభించింది. అయితే అయితే దీనికి ఆశించిన స్థాయిలో జనాల నుంచి ఆదరణ లభించక పోవడంతో పునరాలోచనలో పడింది.
24x7 NEFT: ఆ గంటలో మాత్రం కుదరదు, ఛార్జీలు, ఆయా బ్యాంకు
సలహాలు ఇవ్వండి...
* మన దేశంలో బంగారం లేని కుటుంబాలు లేవంటే అతిశయోక్తి కాదు. కుటుంబాల వద్ద వేల టన్నుల బంగారం ఉందని భావిస్తున్న ప్రభుత్వం దీన్ని బయటకు తీసుకురావాలని భావించింది. కానీ దీనికి మంచి స్పందన లభించడం లేదు. ఈ నేపథ్యంలో ఈ పథకాన్ని ఏవిధంగా మెరుగు పరచాలో సలహాలు ఇవ్వమని ఇటీవలే ఆభరణాల పరిశ్రమ సూచనలను కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ కోరారు.
* ప్రజల వద్ద నిరుపయోగంగా ఉన్న బంగారాన్ని వెలుపలికి తీసుకురావడం వల్ల విదేశీ మారక నిల్వలపై భారం తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
* బంగారం ఉన్న వారు దాన్ని లాకర్లలో భద్రపరుచు కుంటున్నారు. దీనివల్ల వారికి ఎలాంటి ప్రయోజనం కలగడం లేదు. ఈ బంగారం ఆర్ధిక వ్యవస్థకు కూడా ఏవిధంగా పనికి రావడం లేదు. ఈ నేపథ్యలోనే ప్రజలు బంగారాన్ని బయటకు తెచ్చే విధంగా సలహాలు ఇవ్వమని పీయూష్ గోయల్ కోరారు.
నాలుగేళ్ల క్రితం తెచ్చిన పథకం
* దేశంలోని కుటుంబాలు, సంస్థల వద్ద ఉన్న బంగారాన్ని బయటకు తెచ్చే ఉద్దేశంతో ప్రభుత్వం 2015 సంవత్సరంలో బంగారం నగదీకరణ పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీని వల్ల పెద్ద ఎత్తున బంగారం బయటకు వస్తుందని ప్రభుత్వం భావించింది. కానీ ఈ అంచనాలు తప్పాయి.
* తక్కువ స్థాయిలో రాబడి ఉండటంతో పాటు భద్రతా పరమైన ఆందోళనలతో జనాలు ఈ పథకం పై దృష్టి సారించలేదు.ఈ పథకం కింద తమ వద్ద ఉన్న బంగారాన్ని బ్యాంకులో నిర్దేశిత కాలానికి డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. దీనిపై 2.25-2.50 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. అందుకే ఈ పథకం పట్ల పెద్దగా ఆకర్షితులు కావడం లేదని తెలుస్తోంది.
దిగుమతులపైనే ఆధారం
* మనదేశంలో బంగారానికి వార్షికంగా 800-1000 టన్నుల డిమాండ్ ఉంటోంది. ఇందులో అధిక శాతం దిగుమతుల పైనే ఆధారపడాల్సి వస్తోంది. ఈ దిగుమతులను తగ్గించడానికి ప్రభుత్వం గత బడ్జెట్ లో సుంకాన్ని 10 శాతం నుంచి 12.5 శాతానికి పెంచింది.
* అయినప్పటికీ డిమాండ్ పెద్దగా ప్రభావితం కాలేదని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం మన దేశంలోని కుటుంబాల వద్ద 20,000 టన్నుల బంగారం ఉన్నట్టుగా అంచనాలు వెలువడుతున్నాయి.