జనవరి 15 నుంచి హాల్మార్క్ లేదంటే భారీ జరిమానా, జైలు శిక్ష: రూ.50 మాత్రమే ఛార్జ్
బంగారు ఆభరణాలు, కళాకృతులకు హాల్ మార్క్ తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది జనవరి 15, 2020 నుంచి అమలులోకి రానుంది. దేశవ్యాప్తంగా ఎక్కడ తయారయినా, విక్రయించినా హాల్ మార్క్ తప్పనిసరి. ఇందుకు సంబంధించి జనవరి 15న నోటిఫికేషన్ విడుదల చేస్తామని, పూర్తిస్థాయి అమలుకు ఏడాది గడువు ఇస్తాని కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ అన్నారు.

లేదంటే రూ.1 లక్ష జరిమానా, జైలు శిక్ష
తమ వద్ద ఉన్న ఆభరణాలను 2021 జనవరి 15వ తేదీలోపు విక్రయించాల్సి ఉంటుందని, ఆ తర్వాత విక్రయించేందుకు వీలులేదని చెప్పారు. విక్రేతలు అందరూ BIS వద్ద తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని, హాల్ మార్క్ చేసిన ఆభరణాలు, కళాఖండాలే విక్రయించాలన్నారు. లేదంటే రూ.1 లక్ష నుంచి బంగారం విలువపై అయిదు రెట్ల జరిమానా ఉంటుందని, ఏడాది జైలు శిక్ష ఉంటుందని చెప్పారు.

వినియోగదారులకు ఇబ్బంది లేదు
చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోని కస్టమర్ల ప్రయోజనాలు కాపాడేందుకు హాల్ మార్క్ నిర్ణయాన్ని అమలు చేస్తున్నట్లు పాశ్వాన్ చెప్పారు. దీంతో స్వచ్ఛమైన బంగారు ఆభరణాలను కొనుగోలు చేసే అవకాశం ఉంటుందని చెప్పారు. అయితే తాము వినియోగదారుల బంగారం జోలికి వెళ్లడం లేదన్నారు.

877 హాల్ మార్క్ కేంద్రాలు
రానున్న రోజుల్లో 14 క్యారెట్లు, 18 క్యారెట్లు, 22 క్యారెట్ల బంగారం ధరల్ని తమ దుకాణాల్లో రిటైలర్లు తప్పనిసరిగా ప్రదర్శించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. BIS నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా ఉంటుందన్నారు. దేశంలో 2019 అక్టోబర్ 31వ తేదీ నాటికి 234 జిల్లాల్లో 877 హాల్ మార్క్ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 26,019 నగల దుకాణదారులు నమోదు చేసుకున్నారు.

విక్రయదారుల ఇష్టం
బంగారు ఆభరణాలు, స్వర్ణ కళాకృతులకు బీఐఎస్ హాల్ మార్క్ను తప్పనిసరి చేస్తూ WTO వెబ్ సైట్లో నిబంధనలు ఉన్నాయి. దీనిపై 60 రోజుల్లో అభిప్రాయాలు పంపేందుకు వీలు ఉంది. దీని ప్రకారం 2020 జనవరి 15 నాటికి ఆ నిబంధనలు నోటిఫై అవుతాయి. అప్పటి నుంచి దేశంలో తప్పనిసరి అవుతుంది. ఆ తర్వాత ఏడాదిలోపు హాల్ మార్క్ లేని నగలను పూర్తిగా అమ్మేసుకుంటారో లేక వాటిని కరిగించి కొత్త ప్రమాణాల ప్రకారం చేస్తారో విక్రయదారుల ఇష్టం. హాల్ మార్క్ ఉన్న నగను అమ్మడం బాధ్యత. వినియోగదారుల నుంచి ఎలా కొన్నా.. వాటిని కరిగించి తిరిగి ఇచ్చేటప్పుడు హాల్ మార్క్తో మూడు రకాల స్వచ్ఛతతో ఇవ్వాలి.

ఛార్జ్ రూ.50 మాత్రమే
ఓ ఆభరణానికి హాల్ మార్క్ వేసేందుకు రూ.50 మాత్రమే ఛార్జ్ అవుతుంది. అందువల్ల ఈ నిబంధన విక్రయదార్లపై భారం ఏమీ కాదు. కొనుగోలుదారులకు మాత్రం తాము చెల్లించిన డబ్బుకు తగిన స్వచ్ఛత కలిగిన బంగారం లభ్యమవుతుంది. హాల్ మార్కింగ్ విధానం వల్ల పరిశ్రమపై రంగంపై విశ్వసనీయత పెరుగుతుందని, మేలు జరుగుతుందని చెబుతున్నారు.


Click it and Unblock the Notifications