డిజిటల్ ఇండియాలో గూగుల్ రూ.75వేలకోట్ల భారీ పెట్టుబడులు: మోడీతో సుందర్ పిచాయ్..
గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ సోమవారం ప్రధాని నరేంద్ర మోడీతో వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. గత కొద్ది నెలలుగా ప్రపంచమంతా ఎదుర్కొంటున్న కరోనా వైరస్, ఈ మహమ్మారి ప్రభావంతో కార్పోరేట్ ఆఫీసుల్లో కొత్త వర్క్ కల్చర్, ప్రస్తుత టెక్నాలజీ మనిషి జీవితంపై చూపే ప్రభావం తదితర ఎన్నో అంశాలపై వారు చర్చించారు. అలాగే సైబర్ సేఫ్టీ, డేటా సెక్యూరిటీ సహా పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు.
గూగుల్ గుడ్న్యూస్, కొత్త యూజర్ హిస్టరీ ఆటోమేటిక్గా డిలీట్
రూ.75వేల కోట్ల పెట్టుబడులు
ఈ సందర్భంగా భారతీయ ఆవిష్కర్తలకు శుభవార్త తెలిపారు. గూగుల్.. డిజిటల్ ఇండియాలో రూ.75వేల కోట్ల భారీ పెట్టుబడులు పెట్టనుంది. ఈ మేరకు సీఈవో సుందర్ పిచాయ్ వెల్లడించారు. గూగుల్ ఆఫ్ ఇండియాలో భాగంగా ఈ భారీ పెట్టుబడులు పెడుతున్నట్లు తెలిపారు. 10 బిలియన్ డాలర్ల నిధులతో ఇండియన్ డిజిటల్ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి అండగా ఉంటామని తెలిపారు. ఈ మేరకు సుందర్ పిచాయ్ ట్వీట్ చేస్తూ.. ప్రధాని నరేంద్ర మోడీ చేపట్టిన డిజిటల్ ఇండియా కార్యక్రమానికి మద్దతివ్వడం గర్వంగా ఉందన్నారు. డిజిటల్ ఇండియా విజన్తో ప్రధాని పని తీరు పట్ల హర్షం వ్యక్తం చేశారు.
మోడీ ట్వీట్.. ఏం చెప్పారంటే
ఈ రోజు ఉదయం గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్తో అర్థవంతమైన చర్చలో పాల్గొన్నానని, పలు రకాల అంశాలపై అతనితో మాట్లాడానని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. భారతీయ రైతులు, యువత, పారిశ్రామికవేత్తలను మార్చడంలో టెక్నాలజీ పోషించే పాత్ర గురించి చర్చించినట్లు తెలిపారు.
సుందర్ పిచాయ్ ట్వీట్..
భారత్ డిజిటల్ ఎకానమీని మరింత వేగవంతం చేసేందుకు డిజిటలైజేషన్ ఫండ్గా 10 బిలియన్ డాలర్లు పెట్టుబడులు పెడుతున్నామని పిచాయ్ ట్వీట్ చేశారు. ప్రధాని మోడీకి, కేంద్రమంత్రి రవిశంకర ప్రసాద్కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. డిజిటల్ ఇండియా నేపథ్యంలో గూగుల్ ఇండియా సంస్థ త్వరలో తీసుకోబోయే కార్యక్రమాలకు ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తామన్నారు.