బంగారం వ్యాపారుల ఆశలన్నీ నవంబర్ 12న ధనత్రయోదశి పైనే
ప్రస్తుత పండుగ సీజన్లో బంగారానికి మంచి డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా ధన్తెరాస్ రోజున పసిడి కొనుగోలుకు చాలామంది ఆసక్తి చూపుతారు. నవంబర్ 12వ తేదీన ధన్తెరాస్ పర్వదినం ఉంది. ఈ పండుగను ధనత్రయోదశి లేదా ధన్వంతరి త్రయోదశి అని కూడా అంటారు. ఈ పర్వదినం రోజున బంగారం, బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే శుభం జరుగుతుందని ఎంతోమంది విశ్వాసం. అందుకే ఆ రోజున పసిడిని ఎక్కువగా కొనుగోలు చేస్తారు. బంగారాన్ని కొనుగోలు చేసేందుకు చాలామంది ధన్తెరాస్ వరకు వేచి చూస్తారు. మరికొంతమంది కారు, ఖరీదైన ఎలక్ట్రానిక్ అప్లియెన్సెస్ను కూడా ఈ శుభదినం రోజున కొనుగోలు చేస్తారు. ఆన్లైన్ పోర్టల్స్, దుకాణదారులు డిస్కౌంట్లు, ఆఫర్లు ఇస్తారు.
అమ్మకాలు పుంజుకునే అవకాశం
ధనత్రయోదశికి పసడి అమ్మకాలు పుంజుకునే అవకాశాలు ఉన్నాయని జ్యువెల్లరీ వ్యాపారులు ఆశాభావంతో ఉన్నారు. కరోనా కారణంగా గత ఎనిమిది నెలలుగా బంగారం, నగల వ్యాపారాలు బోసిపోయాయి. లాక్ డౌన్ సమయంలో అయితే కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. కరోనా వంటి క్లిష్ట పరిస్థితులు కొనసాగుతుండటం, బంగారం ధరలు రోజురోజుకు పెరుగుతుండటంతో విక్రయాలు అంతంతమాత్రమే ఉన్నాయి. అయితే దసరా సమయంలో కొంత పుంజుకున్నట్లు కనిపించాయి.
70 శాతం సేల్స్
ధరలు గత నెల రెండు నెలలుగా స్థిరంగా ఉండటంతో జనాలు అలవాటు పడుతున్నారు. ఇటీవల ధరలు కూడా పెద్దగా పెరగడం లేదు. దీంతో ఇప్పటికే డిమాండ్ పుంజుకుంటున్నట్లుగా కనిపిస్తున్నాయి. పరిస్థితి ఇలాగే ఉంటే ధనత్రయోదశి సమయంలో సేల్స్ బాగుంటాయని ఆశాభావంతో ఉన్నారు. గత ఏడాది ధనత్రయోదశి సమయంలో జరిగిన ఆభరణాల అమ్మకాల్లో 70 శాతాన్ని నమోదు చేయవచ్చునని భావిస్తున్నారు.
ఆదాయలపై ప్రభావం పడినా..
కరోనా కారణంగా ప్రజల ఆదాయాలపై ప్రభావం పడింది. పండుగ సీజన్లో సేల్స్ పుంజుకుంటాయని, ధనత్రయోదశి, దీపావళి సమయాల్లో బంగారానికి భారతీయులు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. కరోనా పరిస్థితుల్లోను ఇటీవల సేల్స్ పుంజుకుంటున్నాయని ఇండియా జెమ్స్ అండ్ జ్యువెల్లరీ డొమెస్టిక్ కౌన్సిల్ చైర్మన్ అనంత పద్మనాభన్ అన్నారు.