త్వరపడండి!: 2020లో రూ.45,000కు చేరుకోనున్న బంగారం!! కారణాలివే
కొద్ది నెలల క్రితం రూ.33 వేల నుంచి రూ.34 వేల మధ్య ఉన్న బంగారం హఠాత్తుగా రూ.40 వేలకు చేరుకుంది. ఆ తర్వాత రూ.38 వేలకు అటు ఇటుగా కదలాడింది. సోమవారం రూ.39 వేల వద్ద కదలాడింది. బంగారం ధరల ఎగుడు దిగుడులకు అమెరికా - చైనా వాణిజ్య యుద్ధం, డాలర్తో రూపాయి మారకం విలువ మొదలగు ప్రభావాలు ఉంటాయి. బంగారం ధర రూ.40,000 వద్ద కదలాడుతున్న నేపథ్యంలో ఇంకా తగ్గుతుందేమోనని చూసి కొనుగోలు చేసే వారు ఉంటారు. కానీ వచ్చే ఏడాది (2020) బంగారం ధర భారీగా పెరిగే అవకాశాలు లేకపోలేదని అంచనా.
గృహసిద్ధి: హోమ్ లోన్ తీసుకునే వారికి LIC సూపర్ ఆఫర్
బంగారం ధర రూ.45,000కు చేరుకోవచ్చు
భౌగోళిక రాజకీయ అంశాలు, ఆర్థిక అంశాలు, రూపాయి అస్థిరత వంటి వివిధ కారణాలతో బంగారం ధర కొత్త ఏడాదిలో (2020) 10 గ్రాములకు రూ.45,000కు చేరుకోవచ్చునని భావిస్తున్నారు. తద్వారా కొత్త సంవత్సరం బంగారం మరింత ఖరీదుగా మారే అవకాశాలు ఉన్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
ఆర్బీఐ సహా బంగారం నిల్వలు పెంచుకున్న కేంద్ర బ్యాంకులు
2019 ఏడాదిలో ఆయా దేశాల ప్రభుత్వ విధానాలు, స్టాక్ మార్కెట్ వంటి కారణాలతో బంగారం హెచ్చతగ్గులను చూసింది. ఈ ఏడాది రెండో అర్ధ సంవత్సరంలో మాత్రం బంగారం ధర అంతకంతకూ పెరిగింది. ఇందుకు అమెరికా - చైనా ట్రేడ్ వార్ కూడా ఓ కారణంగా చెప్పవచ్చు. ఇటీవలి కాలంలో కేంద్ర బ్యాంకులు బంగారం నిల్వలు పెంచుకున్నాయి. ఆర్బీఐ సహా 14 కేంద్ర బ్యాంకులు ఈ ఏడాది ఒక టన్నుకు పైగా బంగారం నిల్వలు పెంచుకున్నట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సెల్ డేటా వెల్లడిస్తోంది.
బంగారం సురక్షిత పెట్టుబడి...
2020 సంవత్సరంలో పెట్టుబడిదారులు భౌగోళిక రాజకీయ సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉండవచ్చునని, అలాగే స్టాక్ మార్కెట్ ప్రభావం కూడా బంగారంపై ఉండే అవకాశముందని, దీంతో పసిడిని సురక్షిత పెట్టుబడిగా భావించి ఎక్కువమంది ఇటువైపు మొగ్గు చూపే అవకాశాలు ఉండవచ్చునని కామ్ట్రెండ్జ్ రీసెర్చ్ డైరెక్టర్ జ్ఞానశేఖర్ త్యాగరాజన్ అభిప్రాయపడ్డారు.
ఈ కారణంతో బంగారానికి డిమాండ్
అమెరికా - చైనా ట్రేడ్ వార్ అంశంతో పాటు మిడిల్ ఈస్ట్ దేశాల్లో సంఘర్షణలు ఇబ్బందులను సృష్టించవచ్చునని, ఈ క్రమంలో బంగారంపై పెట్టుబడులకు డిమాండ్ పెరుగవచ్చునని, ఇది ధరల పెరుగుదలకు దారి తీస్తుందని జ్ఞానశేఖర్ త్యాగరాజన్ పీటీఐతో అన్నారు. 2020 చివరలో అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రభావం కూడా ఉండవచ్చునని చెప్పారు.
రూ.41,000 నుంచి రూ.45,000..
ఇలా వివిధ కారణాలతో బంగారం ధర ఎంసీఎక్స్లో 10 గ్రాములు రూ.41,000 నుంచి 41,500లకు (USD 1,640-1,650) చేరుకోవచ్చునని, గరిష్ఠంగా రూ.44,500-45,000ల (USD 1,795-1,800) వరకు ఉండవచ్చునని త్యాగరాజన్ చెప్పారు.
కొనుగోళ్లు బలంగా ఉన్నాయి..
రూపాయి సహా అన్ని కరెన్సీలు కూడా గతంలోని గరిష్టస్థాయిని దాటేశాయని, ఇది మార్కెట్లలో వినియోగదారుడి డిమాండును మ్యూట్ చేసిందని వరల్డ్ గోల్డ్ కౌన్సెల్ మేనేజింగ్ డైరెక్టర్ (ఇండియా) సోమసుందరం అన్నారు. భారత్ విషయానికి వస్తే ఈ ఏడాది (2019) మూడో క్వార్టర్లో బంగారానికి డిమాండ్ పెరిగిందని, 4వ క్వార్టర్లో పెళ్లిళ్లు, పండుగల వంటి వివిధ కారణాలతో డిమాండ్ పెరిగినప్పటికీ, మొత్తంగా ఏడాది లెక్కన మాత్రం డిమాండ్ తగ్గిందని చెప్పారు. అమెరికా, యూరోప్లలో ఈటీఎఫ్ (ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్), సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు బలంగా ఉన్నాయన్నారు.