ఆ మార్కు దాటితే మళ్లీ 2000 డాలర్ల దిశగా బంగారం ధర
గత కొద్ది రోజులుగా దాదాపు స్థిరంగా ఉన్న బంగారం ధరలు క్రితం సెషన్లో పరుగు పెట్టాయి. వివిధ నగరాల్లో ఒక్కరోజులోనే రూ.1000 పెరిగింది. ఇక దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో చివరి సెషన్లోనే దాదాపు రూ.700 పెరిగింది. అదే సమయంలో సిల్వర్ ధరలు మాత్రం స్వల్పంగా తగ్గాయి. గత వారం ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.689 పెరిగి రూ.51,694 వద్ద, అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.674 పెరిగి రూ.51,921 పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్లో ఏకంగా 1875 డాలర్లు క్రాస్ చేసింది. గత నెలలో ఓ సమయంలో 1810 డాలర్ల దిగువకు పడిపోయినప్పటికీ, ఆ తర్వాత క్రమంగా పెరుగుతూ 1900 డాలర్ల దిశగా కనిపిస్తోంది.
ప్రస్తుతం చాలా రోజులుగా పసిడి ధరలు 1800 డాలర్ల నుండి 1900 డాలర్ల మధ్య కదలాడుతున్నాయి. ఇప్పటికీ 1900 డాలర్ల దిగువన (1875 డాలర్లు) ఉన్నప్పటికీ, ఈ స్థాయిని క్రాస్ చేస్తే మాత్రం 2000 డాలర్ల దిశగా వెళ్లవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. పసిడి ధరలు అంతర్జాతీయ మార్కెట్లో 1900 డాలర్లు దాటితే, ఆ తర్వాత బుల్లిష్గా కనిపిస్తోందని, ఓసారి కనుక ఈ స్థాయిని దాటితే ఇటీవలి గరిష్టం 1950 డాలర్లకు చేరుకోవచ్చునని, ఆ మార్కును కూడా దాటితే 2000 డాలర్లను అందుకోవచ్చునని అంటున్నారు.
బంగారం ధరలు వచ్చే క్యాలెండర్ ఏడాదిలోను 1700 డాలర్ల నుండి 2050 డాలర్ల స్థాయిలో ఉండవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. 2024లో ఏకంగా 2300 డాలర్లకు చేరుకోవచ్చునని, 2025 నాటికి 2700 స్థాయికి చేరుకునే అవకాశాలు కొట్టి పారేయలేమని చెబుతున్నారు.