బంగారం ధరలు పైకి కిందకు, నేడు తగ్గుదల: 10 రోజుల్లో హైదరాబాద్ మార్కెట్లో..
ఈక్విటీ మార్కెట్లు పుంజుకోవడంతో బంగారం ధరలు నిన్న (మార్చి 31) దిగి వచ్చాయి. అయితే బుధవారం అంతర్జాతీయ మార్కెట్లు పెరిగాయి. బంగారం గత కొద్ది రోజులుగా హెచ్చుతగ్గులు చూస్తోంది. కరోనా మహమ్మారి భయాల కారణంగా పసిడి డిమాండ్ను తగ్గిస్తుందనే ఆందోళన కూడా బులియన్ మార్కెట్ సెంటిమెంటును ప్రభావితం చేస్తోంది. సంక్షోభ సమయంలో కరెన్సీల వైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతున్నారు. దీంతో బంగారం ధరలు తగ్గాయి.
ఆర్థిక మాంద్యంలోకి ప్రపంచం, భారత్-చైనా ఉండకపోవచ్చు
నిన్న ఎంత తగ్గిందంటే..
మంగళవారం ఎంసీఎక్స్లో 10 గ్రాముల బంగారం రూ.492 తగ్గింది. కిలో వెండి రూ.379 పతనమైంది. కరోనా నేపథ్యంలో రోజు రోజుకు అతి ఖరీదైన లోహాల ధరలలో హెచ్చుతగ్గులు ఉంటాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. నేడు (ఏప్రిల్ 1) బంగారం ధరలు ఎంసీఎక్స్లో 0.51 శాతం (రూ.218) తగ్గి రూ.42,738గా ఉంది. వెండి ధర కిలో 0.19 శాతం (రూ.77) తగ్గి రూ.39,600గా ఉంది.
10 రోజుల్లో హైదరాబాద్ మార్కెట్లో...
హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర గత పది రోజులుగా ఎగుస్తూ, తగ్గుతూ ఉంది. మార్చి 22న 24 క్యారెట్ల బంగారం రూ.43,280, ఉండగా మార్చి 27 నాటికి రూ.45,300కు చేరుకుంది. మార్చి 31న తిరిగి రూ.43,160గా ఉంది. 22 క్యారెట్ల బంగారం మార్చి 22న రూ.39,670గా ఉంది. మార్చి 27 నాటికి రూ.41,770కి ఎగిసి మార్చి 31న రూ.39,510గా ఉంది. మొత్తంగా ఈ పది రోజుల్లో భారీగా పెరిగి.. అదే స్థాయిలో తగ్గింది.
అంతర్జాతీయ మార్కెట్లు పెరుగుదల
బుధవారం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరిగాయి. ఔన్స్ స్పాట్ గోల్డ్ 0.4 శాతం పెరిగి 1,577.83 డాలర్లుగా ఉంది. అంతకుముందు సెషన్లో 3.1 శాతం తగ్గింది. అయితే యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.3 శాతం తగ్గి 1,591.30 డాలర్లుగా ఉంది. రైవల్స్తో డాలర్ 0.1 శాతం మేర తగ్గింది.
ఇతర ఖరీదైన లోహాలు..
ఇతర అతి ఖరీదైన లోహాల విషయానికి వస్తే పల్లాడియం ఔన్స్ 0.3 శాతం తగ్గి 2,344.99 డాలర్ల వద్ద, ప్లాటినమ్ 0.7 శాతం తగ్గి 717.39 డాలర్లు, వెండి 0.3 శాతం తగ్గి 13.93 డాలర్లుగా ఉంది.