Gold Prices Today: మళ్లీ రూ.53,000 దాటిన బంగారం ధరలు
బంగారం ధరలు మళ్లీ భారీగా పెరుగుతున్నాయి. క్రితం సెషన్లో గోల్డ్ ఫ్యూచర్స్ ఏకంగా రూ.53,000 క్రాస్ చేసింది. రష్యా - ఉక్రెయిన్ యుద్ధం సమయంలో పసిడి ధరలు రూ.55,000 క్రాస్ చేశాయి. ఆ తర్వాత క్రమంగా తగ్గి రూ.51,000 దిగువకు వచ్చాయి. కానీ ఈ కొద్ది రోజుల్లోనే తిరిగి రూ.53,000 దాటాయి. ఈ కొద్ది సెషన్లలోనే గోల్డ్ ఫ్యూచర్స్ రూ.2000కు పైగా పెరిగింది. నేడు అంబేడ్కర్ జయంతి, మహావీర్ జయంతి సందర్భంగా స్టాక్, బులియన్ మార్కెట్కు సెలవు రోజు. నిన్న మాత్రం ధరలు భారీగా పెరిగాయి.
క్రితం సెషన్లో జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.220 పెరిగి రూ.53,098 వద్ద, ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.168 పెరిగి రూ.53,293 వద్ద ముగిసింది. మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.667 ఎగిసి రూ.69,457 వద్ద, జూలై సిల్వర్ ఫ్యూచర్స్ రూ.681 ఎగిసి రూ.70,143 వద్ద ముగిసింది. బంగారం ధరలు చాలా రోజులకు రూ.53,000 క్రాస్ చేశాయి.
అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ ఆల్ టైమ్ గరిష్టం 2075 డాలర్ల నుండి రష్యా-ఉక్రెయిన్ యుద్ధం అనంతరం ఓ సమయంలో 1920 డాలర్ల దిగువకు పడిపోయింది. ఇప్పుడు మళ్లీ 1975 డాలర్లకు చేరుకుంది. గోల్డ్ ఫ్యూచర్స్ నేడి సెషన్లో 10.20 డాలర్లు నష్టపోయి 1974.50 డాలర్ల వద్ద, సిల్వర్ ఫ్యూచర్స్ 0.020 డాలర్లు క్షీణించి 26.010 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. గోల్డ్ ఫ్యూచర్స్ క్రితం సెషన్లో ఏకంగా 1984 డాలర్లు క్రాస్ చేసింది. నిన్న భారీగా పెరిగి, నేడు స్వల్పంగా తగ్గింది.