తగ్గుతున్న బంగారం ధర, వారం రోజుల్లో ఎంత తగ్గిందంటే?
అమెరికా-ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గడం, అమెరికా-చైనా మధ్య తొలిదశ ట్రేడ్ డీల్ పూర్తి కావడంతో బంగారం ధర ఈ వారంలోను తగ్గాయి. ఏడు రోజుల్లో బంగారం ధర రూ.1,600 మేర తగ్గింది. అయితే గురువారం (16 జనవరి 2020) రోజున ఎంసీఎక్స్లో స్వల్పంగా పెరిగింది. 10 గ్రాముల గోల్డ్ ఫ్యూచర్స్ 0.06 శాతం పెరిగి రూ.39,635గా ఉంది. కిలో వెండి 0.2 శాతం తగ్గి రూ.46,290 వద్ద ఉంది.
గత వారం అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల కారణంగా బంగారం ధర రూ.41,300తో రికార్డ్ హైకి చేరుకుంది. ఏడు ట్రేడింగ్ సెషన్లలో 10 గ్రాముల బంగారం ధర రూ.1,600 తగ్గింది. బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్లోను నిలకడగా ఉన్నాయి. అమెరికా - చైనా ట్రేడ్ డీల్ కారణంగా బంగారంపై ఒత్తిడి తగ్గింది. స్పాట్ గోల్డ్ ఔన్సుకు 0.1 శాతం మాత్రమే పెరిగి 1,556.69 డాలర్లు వద్ద, ఔన్స్ వెండి 17.99 డాలర్ల వద్ద నిలకడగా ఉంది.
తాజా పరిణామాల నేపథ్యంలో బంగారం ధర రూ.39,700 వద్ద ప్రతిఘటన ఎదుర్కోవచ్చునని, రూ.39,500 కంటే దిగువకు చేరుకోవచ్చునని నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే వెండి కిలో ధర 46,000కు చేరుకోవచ్చునని అంచనా వేస్తున్నారు. బంగారం రూ.39,800 వద్ద రీసెట్ కావొచ్చునని కూడా నిపుణులు అంచనా వేస్తున్నారు.