మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు, రూ.51,000 వద్ద పసిడి
బంగారం ధరలు గతవారం స్వల్పంగా పెరిగాయి. అంతకుముందు సిక్స్ బాస్కెట్ కరెన్సీలో డాలర్ వ్యాల్యూ భారీగా పెరిగింది. అలాగే యూఎస్ ట్రెజరీ యీల్డ్స్ పెరిగాయి. దీంతో పసిడి ధరలు అంతకుముందు క్షీణించాయి. కానీ గతవారం డాలర్ వ్యాల్యూ క్షీణించడంతో పాటు యూఎస్ ట్రెజరీ యీల్డ్స్ తగ్గాయి. దీంతో పసిడి ధర మళ్లీ పరుగు పెడుతోంది.
గతవారం పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. అంతకుముందు వారం ఓ సమయంలో రూ.50,000 దిగువకు వచ్చిన గోల్డ్ ఫ్యూచర్స్, ఇప్పుడు రూ.51,000 సమీపంలో ఉన్నాయి. జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ గతవారం చివరి సెషన్లో రూ.57 పెరిగి రూ.50,928 వద్ద ముగిసింది. ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.51,061 వద్ద ముగిసింది. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ రూ.386 పెరిగి రూ.62,179 వద్ద, సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.62,887 వద్ద ముగిసింది.
అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్లో గోల్డ్ ఫ్యూచర్స్ 1850 డాలర్ల పైకి చేరుకుంది. గోల్డ్ ఫ్యూచర్స్ క్రితం సెషన్లో 4 డాలర్లు పెరిగి 1851.64 డాలర్ల వద్ద, సిల్వర్ ఫ్యూచర్స్ 0.165 డాలర్లు పెరిగి 22.130 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఆల్ టైమ్ గరిష్టం 2075 డాలర్లతో పోలిస్తే ప్రస్తుతం 225 డాలర్లు తక్కువగా ఉంది.