కరోనా వైరస్ దెబ్బ, 3 రోజులుగా పెరుగుతున్న బంగారం ధర: రికార్డ్ ధరకు సమీపంలో..
బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్ల అనిశ్చితి కారణంగా ఇన్వెస్టర్లు పసిడి వైపు మొగ్గు చూపుతున్నారు. ఎంసీఎక్స్లో వరుసగా మూడో రోజు... సోమవారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల బంగారం 0.58 శాతం లేదా రూ.233 పెరిగి రూ.40.585కి చేరుకుంది. వెండి ధర కూడా పెరిగింది. కిలో వెండి 0.76 శాతం పెరిగి రూ.47,291 వద్ద ఉంది.
కరోనా వైరస్ దెబ్బతో.. బంగారం వైపు
అంతర్జాతీయ మార్కెట్లలో కూడా బంగారం ధరలు 0.6 శాతం పెరిగి ఔన్స్ ధర 1,586 డాలర్ల వద్ద ఉంది. వెండి ఔన్స్ ధర 0.9 శాతం పెరిగి 18.24 డాలర్ల వద్ద ఉంది. చైనాలో వేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందనే ఆందోళనతో ఇన్వెస్టర్లు బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు మొగ్గు చూపుతున్నారు.
కరోనాతో పాటు యూఎస్ ఫెడరల్ రిజర్వ్
కరోనా వైరస్ కారణంగా 80 మంది వరకు మృతి చెందారని, ఈ వ్యాధి సోకిన వారి సంఖ్య 2,000కు చేరుకుందని, ఈ వైరస్ మరింతగా బలపడుతోందని చైనా ఆరోగ్య అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా వైరస్తో పాటు జనవరి 28-29 మధ్య ఈ ఏడాది అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఫస్ట్ మీటింగ్ ఉంది. దీంతో దీనిపై దృష్టి సారించారు.
ఈ ఏడాది రికార్డ్ హై కంటే రూ.750 తక్కువ
ఇండియా సహా ఆసియా మార్కెట్లో గత వారం బంగారం డిమాండ్ ఆశించిన మేర లేదు. ఈ ఏడాది ప్రారంభంలో బంగారం ధర రూ.41,293తో రికార్డ్ హైకి చేరుకుంది. ఇప్పుడు రూ.40.560 వద్ద ఉంది. ఈ ఏడాది రికార్డ్ హై ధరకు రూ.750 తక్కువగా ఉంది.
మద్దతు ధర రూ.40,050
డొమెస్టిక్ మార్కెట్లో బంగారం మద్దతు ధర రూ.40,050 వద్ద ఉండవచ్చునని, వెండి ధర రూ.46,800గా ఉండవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు అంటున్నారు. త్వరలో పెళ్లి ముహూర్తాల నేపథ్యంలో బంగారానికి డిమాండ్ పెరిగే అవకాశముంది.