2 నెలల గరిష్టానికి: భారీగా పెరిగిన బంగారం ధరలు, రూ.39,000 సమీపంలో..
బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు, దేశీయంగా డిమాండ్ పుంజుకోవడంతో గత వారం రోజులుగా బంగారం ధర పెరుగుతోంది. శుక్రవారం (డిసెంబర్ 27) కూడా పెరిగింది. పసిడి ధర రెండు నెలల గరిష్టానికి దగ్గరలో ఉంది. గోల్డ్ ఫిబ్రవరి ఫ్యూచర్ ఔన్స్కు 1,512.30 డాలర్లకు చేరుకుంది. నవంబర్ 4వ తేదీ తర్వాత ధర ఇంత గరిష్టానికి రావడం ఇదే మొదటిసారి.
ఇండియన్ రైల్వేలో పెరగనున్న భోజనం, టిఫిన్ ధరలు, ఎంతంటే?
పెరిగిన బంగారం ధర
పసిడి ధర ఈ ఏడాది 18 శాతం నుంచి 20 శాతం పెరిగిన విషయం తెలిసిందే. హైదరాబాద్ మార్కెట్లో ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ.320 పెరిగింది. దీంతో రూ.37 వేలకు సమీపంలో ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.370 పెరిగి రూ.40 వేల మార్క్ దాటింది.
రూ.750 వరకు పెరిగిన ధర
బంగారం ధర దాదాపు వారం రోజులుగా పెరుగుతోంది. ఈ కాలంలో పసిడి ధర 10 గ్రాములకు రూ.750 నుంచి రూ.800 వరకు పెరిగింది. డిసెంబర్ 20వ తేదీన 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.39,590 ఉండగా, ఇప్పుడు రూ.40,330కి చేరుకుంది. బంగారంతో పాటు వెండి ధర కూడా పెరిగింది. కిలో వెండి రూ.500 వరకు పెరిగింది. వెండి ధర మూడు రోజుల్లో రూ.950 పెరిగింది.
రూ.39,000 సమీపంలో..
శుక్రవారం ఉదయం గం.9.20 నిమిషాలకు ఎంసీఎక్స్లో గోల్డ్ ఫిబ్రవరి ఫ్యూచర్స్ ధర రూ.88 లేదా 0.23 శాతం పెరిగి రూ.38,970గా ఉంది. వెండి ధర కిలో రూ.47,232 వద్ద ఉంది. ఇటీవలి వరకు బంగారం రూ.38,000కు అటు ఇటుగా ఉండగా, ఇప్పుడు రూ.39,000కు సమీపంలో ఉంది.