తగ్గినా... బంగారం ధరలు ఎటువైపు: రూ.45,000కు బంగారం?
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గడంతో పాటు అమెరికా-చైనా మధ్య వాణిజ్య తొలిదశ ఒప్పందం అనంతరం బంగారంపై ఒత్తిడి తగ్గింది. దీంతో పసిడి ధర దిగి వచ్చింది. తాజాగా, స్వల్పంగా పెరిగింది. మొత్తంగా గత వారంలో మాత్రం బంగారం ధర తగ్గింది. అదే సమయంలో వెండి ధర మాత్రం పెరిగింది.
ప్రారంభంలో భారీగా తగ్గి, ఆ తర్వాత స్వల్పంగా పెరిగిన బంగారం
వారం ప్రాతిపదికన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర భారీగా పడిపోగా, 22 క్యారెట్ల బంగారం ధర స్వల్పంగా క్షీణించింది. వెండి ధర పెరిగింది. అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గడంతో గతవారం ప్రారంభంలో తగ్గింది. వారాంతంలో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర స్వల్పంగా పెరగడంతో పాటు దేశీయ మార్కెట్ జ్యువెల్లర్స్ నుంచి కొనుగోలుదారుల నుంచి డిమాండ్ పెరిగింది. దీంతో ధర పెరిగింది. డాలర్తో రూపాయి మారకం విలువ పడిపోవడం కూడా ఓ కారణం.
హైదరాబాద్ మార్కెట్లో..
గతవారం ప్రారంభంలో అంటే సోమవారం 24 క్యారెట్ల బంగారం రూ.42,050గా ఉండగా, శనివారం నాటికి రూ.41,050కి దిగి వచ్చింది. అంటే రూ.వెయ్యి తగ్గింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.38,200 నుంచి రూ.38,100కు దిగి వచ్చింది. వెండి ధర రూ.49,150 నుంచి రూ.49,400కు పెరిగింది.
సమీప భవిష్యత్తులో పెరిగే అవకాశం
బంగారం ధర ప్రస్తుతానికి తగ్గినప్పటికీ సమీప భవిష్యత్తులో భారీగా పెరిగే అవకాశముందని బులియన్ మార్కెట్ నిపుణుల అంచనా. 2020లో బంగారం 10 గ్రాములకు రూ.45,000 చేరుకోవచ్చునని భావిస్తున్నారు. ఇటీవల బంగారం ధర ఆల్ టైమ్ హైకి చేరుకుంది. ఈ ఏడాదిలో రూ.45వేలకు చేరుకోవచ్చునని చెబుతున్నారు.
ఔన్స్ 1700 డాలర్లు చేరుకోవచ్చు
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్స్ 21.28 డాలర్లు పెరిగిందని, దీంతో 1,605 డాలర్లకు చేరుకొని జీవనకాల గరిష్టానికి చేరుకుందని, రాబోవు రోజుల్లోను ధరలు పెరగవచ్చునని చెబుతున్నారు. జనవరి నెలలో స్వల్పంగా పెరుగుతూ ధరలు నిలకడగా ఉండవచ్చునని, వచ్చే ఆరు నెలల్లో 1,630 డాలర్లకు చేరుకోవచ్చునని అంటున్నారు. ఔన్స్ 1,700 డాలర్లకు చేరుకోవచ్చునని అంచనా వేస్తున్నారు.