ఏప్రిల్-సెప్టెంబర్లో 57% తగ్గిన బంగారం దిగుమతులు, మెరుగుపడిన వాణిజ్య లోటు
కరోనా మహమ్మారి నేపథ్యంలో గత ఆరు నెలలుగా బంగారం ధరలు పెరగడంతో రిటైల్ కొనుగోళ్లు తగ్గాయి. లాక్ డౌన్ నేపథ్యంలో ప్రారంభంలో దిగుమతులు పడిపోయాయి. ధరల పెరుగుదల, కరోనా ఆంక్షల నేపథ్యంలో బంగారం దిగుమతులు సెప్టెంబర్ నెలలోను క్షీణించాయి. ఇక, 2020-21 మొదటి అర్ధ సంవత్సరంలో (ఏప్రిల్-సెప్టెంబర్) పసిడి దిగుమతులు ఏకంగా 57 శాతం క్షీణించి 6.8 బిలియన్ డాలర్లకు (రూ.50,658 కోట్లు) తగ్గాయి. ఆగస్ట్ రెండో వారం నుండి పసిడి ధరలు తగ్గాయి. అంతకుముందు ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200కు చేరుకున్నాయి.
ముంబై, ఢిల్లీల కంటే హైదరాబాద్ అదుర్స్.. కొత్త రెసిడెన్షియల్ ప్రాజెక్టుల్లో టాప్
బంగారం, వెండి దిగుమతుల్లో క్షీణత
2019-20 ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో బంగారం దిగుమతులు 15.8 బిలియన్ డాలర్లు (రూ.1,10,259 కోట్లు) ఉండగా, ఈసారి 57 శాతం క్షీణించాయి. అదే సమయంలో వెండి దిగుమతులు ఏప్రిల్-సెప్టెంబర్ 2020లో 63.4 శాతం క్షీణించి, 733.57 మిలియన్ డాలర్లకు (రూ.5,543 కోట్లు) పరిమితమైనట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. బంగారం, వెండి ధరలు పెరగడం కూడా రిటైల్ సేల్స్ తగ్గడానికి కారణమైంది.
మెరుగుపడిన వాణిజ్య లోటు
బంగారం, వెండి దిగుమతులు భారీగా తగ్గడంతో భారత వాణిజ్య లోటు మెరుగుపడింది. గత ఏడాది ఏప్రిల్-సెప్టెంబర్ మాసంలో దేశీయ వాణిజ్య లోటు 88.92 బిలియన్ డాలర్లు గా ఉండగా, ఇప్పుడు 23.44 బిలియన్ డాలర్లకు తగ్గింది. అతిపెద్ద బంగారం దిగుమతిదారుగా భారత్ ప్రతి సంవత్సరం 800 నుంచి 900 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది. ఈ ఏడాది దేశం నుండి జెమ్స్, జ్యువెలరీ ఎగుమతులు కూడా 55 శాతం మేర క్షీణించాయి.
పదేళ్లలో హెచ్చుతగ్గులు
గత పదేళ్ల డేటాను పరిశీలిస్తే భారత రూపాయిల్లో బంగారం దిగుమతులు 2013లో ఎక్కువగా ఉన్నాయి. 2010-11 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఆ తర్వాత వరుసగా 2012-13 వరకు క్రమంగా పెరిగాయి. ఆ తర్వాత 2013-14 ఆర్థిక సంవత్సరంలో క్షీణించాయి. ఆ తర్వాత రెండేళ్లు దాదాపు ఒకేలా ఉన్నప్పటికీ, 2016-17లో క్షీణించాయి. FY2018, FY2019లో పెరిగిన దిగుమతులు, మందగమనం, ధరల పెరుగుదల వంటి వివిధ కారణాలతో FY2020లో తగ్గాయి. ఈసారి కరోనా వల్ల అంతకంటే క్షీణించాయి.