బంగారం డిమాండ్ 47% పెరిగింది కానీ ఈసారి డౌన్! ధర మరింత పెరిగే ఛాన్స్
బంగారం డిమాండ్ పుంజుకుంది. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో పసిడి డిమాండ్ 47 శాతం పెరిగింది. పండుగ సీజన్, పెళ్లిళ్ల సీజన్ డిమాండ్ కారణంగా పుంజకుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రీజినల్ సీఈవో సోమసుందరం అన్నారు. అధిక ద్రవ్యోల్భణ అంచనాలు, ఆందోళనలు కూడా బంగారం ధరలు మున్ముందు మరింత పెరగడానికి దోహదపడవచ్చునని ఆయన చెప్పారు. భారత్లో 2021 క్యాలెండర్ ఏడాదిలోని మూడో త్రైమాసికంలో (జూలై-సెప్టెంబర్) బంగారం డిమాండ్ 139.1 టన్నులుగా నమోదయిందని, 2020లో ఇదే కాలంతో పోలిస్తే ఇది 47 శాతం అధికమని తెలిపారు. సానుకూల వాణిజ్యం, వినియోగదారుల సెంటిమెంట్ను అధిక పసిడి డిమాండ్ ప్రతిబింబిస్తుందన్నారు. ప్రాథమికంగా అధిక వ్యాక్సీన్ రేటు, అదే సమయంలో తగ్గిపోతున్న వైరస్ రేటు ఆర్థిక రికవరీకి ఊతమిస్తుందని అభిప్రాయపడ్డారు.
58 శాతం జంప్
వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ విడుదల చేసిన డేటా ప్రకారం గోల్డ్ జ్యువెల్లరీ డిమాండ్ ఏడాది ప్రాతిపదికన 58 శాతం పెరిగి 96.2 టన్నులుగా నమోదయింది. బార్లు, కాయిన్స్లలో పెట్టుబడి ఏడాది ప్రాతిపదికన 18 శాతం పెరిగింది. కరోనా సెకండ్ వేవ్ అనంతరం బంగారం ధరలు తగ్గడం కూడా డిమాండ్ పుంజుకోవడానికి దోహదపడింది. బంగారం డిమాండ్ కరోనా ముందుస్థాయికి చేరుకుందని తెలిపింది. ఇదే ధోరణి కొనసాగవచ్చునని వెల్లడించింది. పండుగ సీజన్ కోసం కొంత పసిడి నిల్వలను సమకూర్చుకున్నందున అక్టోబర్-డిసెంబర్ కాలంలో దిగుమతులు గణనీయంగా పడిపోవచ్చునని కూడా అంచనా వేసింది. డిజిటల్ బంగారానికి డిమాండ్ భారీగా పెరిగిందని ఈ నివేదిక తెలిపింది.
ఆభరణాల కొనుగోళ్లు
ఈ నివేదిక ప్రకారం ఆభరణాల కొనుగోళ్లు రూ.27,750 కోట్ల నుండి 48 శాతం పెరిగి రూ.41,030 కోట్లకు చేరుకున్నాయి. పెట్టుబడులు 33.8 టన్నుల నుండి 27 శాతం అధికమై 42.9 టన్నులకు చేరుకోగా, వ్యాల్యూపరంగా రూ.15,410 కోట్ల నుండి 19 శాతం పెరిగి రూ.18,300 కోట్లకు చేరాయి. పాత బంగారం మార్పిడి 41.5 టన్నుల నుండి 50 శాతం తగ్గి 20.7 టన్నులకు తగ్గింది. నికర పసిడి దిగుమతులు 89 టన్నుల నుండి 255.6 టన్నులకు పెరిగింది.
మరింత పెరగవచ్చు
దేశవ్యాప్తంగా ఆంక్షలు క్రమంగా ఎత్తివేస్తున్నందున రిటైల్ డిమాండ్ కరోనా పూర్వస్థితికి చేరుకుంది. బంగారానికి ఇంత డిమాండ్ నెలకొనడం మహమ్మారి తర్వాత ఇదే ప్రథమం. వినూత్న సాంకేతిక చొరవలు, ప్రముఖ ఆభరణాల UPI ప్లాట్ఫామ్స్ వంటి అంశాలు ఆన్లైన్ కొనుగోళ్లను ఇష్టపడే కొనుగోలుదారులు, పెట్టుబడిదారుల సంఖ్యను పెంచడానికి గణనీయంగా దోహదపడింది. రాబోయే నెలల్లో కమోడిటీ ధరలు మరింత పెరిగే అవకాశముంది. రవాణా వ్యయాల భారం పెరుగుతుంది. ఆయా అంశాలు ద్రవ్యోల్భణం పెరుగుదలకు దారితీయవచ్చు. ఇది దీర్ఘకాలంలో బంగారం డిమాండ్ మరింత పటిష్టం కావడానికి కలిసి వస్తుంది.