భారత్లో మళ్లీ బంగారానికి భలే డిమాండ్, ప్రపంచవ్యాప్తంగా డౌన్
అంతర్జాతీయంగా జనవరి-మార్చి-2021 కాలంలో బంగారం డిమాండ్ క్షీణించింది. 2020లో ఇదే కాలంతో పోలిస్తే 23 శాతం క్షీణించి 815.7 టన్నులకు తగ్గింది. ప్రధానంగా గోల్డ్ బ్యాక్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్(ETFs) నుండి పెద్ద ఎత్తున బంగారం బయటకు వెళ్లడం, కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు తగ్గడం కారణమని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్(WCG) నివేదిక తెలిపింది. 2020 జనవరి-మార్చి కాలంలో బంగారం డిమాండ్ 1,058.9 టన్నులుగా ఉంది. ఈ మేరకు WCG గోల్డ్ డిమాండ్ ట్రెండ్స్ క్యూ1 2021 నివేదిక వెల్లడించింది.
ధరలు, వడ్డీ రేట్ల ప్రభావం
జనవరి-మార్చి 2021 కాలంలో ఇన్వెస్ట్మెంట్ డిమాండ్ 2020 అదే కాలంతో 76 శాతం తగ్గింది. గత ఏడాది 549.6 టన్నులు కాగా, ఈ ఏడాది 161.6 టన్నులుగా ఉంది. ప్రధానంగా గోల్డ్ ఈటీఎఫ్ల నుండి బయటకు వెళ్లడం ప్రభావం చూపింది. గోల్డ్ ఈటీఎఫ్ల నుండి గత త్రైమాసికంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు బయటకు వెళ్లాయి. అత్యధిక వడ్డీ రేట్లు, ధరలు పడిపోవడం వంటి అంశాలు ప్రభావం చూపాయి.
దేశీయంగా డిమాండ్ జంప్
దేశీయంగా బంగారానికి డిమాండ్ మళ్లీ పెరిగింది. 2020 జనవరి-మార్చి నాటి 102 టన్నులతో పోలిస్తే ఈ ఏడాది ఇదే సమయంలో డిమాండ్ 37 శాతం వృద్ధితో 140 టన్నులకు చేరుకుంది. కరోనా ఆంక్షల సడలింపు, 10 గ్రాముల పసిడి ధర జీవనకాల గరిష్ఠాల నుండి రూ.47,000 దరిదాపుల్లోకి దిగిరావడం ఇందుకు కారణమని WCG పేర్కొంది. విలువ పరంగా ఏడాది వ్యవధిలో పసిడి డిమాండ్ రూ.37,580 కోట్ల నుండి 57 శాతం పెరిగి రూ.58,800 కోట్లకు చేరుకుంది.
జ్యువెల్లరీ డిమాండ్
జ్యువెల్లరీ డిమాండ్ 39 శాతం వృద్ధి చెంది 102.5 టన్నులకు చేరుకుంది. వ్యాల్యూపరంగా ఇది 58 శాతం పెరిగి రూ.43,100 కోట్లుగా నమోదయింది.పెట్టుబడుల డిమాండ్ 28.1 టన్నుల నుండి 34 శాతం పెరిగి 37.5 టన్నులకు చేరింది. వ్యాల్యూపరంగా రూ.10,350 కోట్ల నుండి 53 శాతం వృద్ధితో రూ.15,780 కోట్లకు చేరుకుంది. గోల్డ్ పునర్వినియోగం 18.5 టన్నుల నుండి 20 శాతం క్షీణించి 14.8 టన్నులకు పడిపోయింది.