5 రోజుల్లో రూ.3 లక్షల కోట్లకు పైగా ఆర్జించారు: వచ్చే వారం మరో రికార్డ్!
ముంబై: స్టాక్ మార్కెట్లు వరుసగా గత ఐదు రోజులు లాభాల్లో ముగిశాయి. దీంతో ఇన్వెస్టర్లు భారీగా లాభపడ్డారు. నిన్నటి వరకు నాలుగు రోజుల్లోనే ఇన్వెస్టర్ల సంపద రూ.2.93 లక్షల కోట్లు పెరిగింది. మన దేశంలో కరోనా కేసులు తగ్గి, ఆర్థిక కార్యకలాపాలు వేగంగా పెరగడంతో ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ పెద్ద ఎత్తున వస్తున్నాయి. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో ఉన్నాయి. ఈ ప్రభావం కూడా మన మార్కెట్లపై కనిపిస్తోంది. దీంతో ఈ ఏడాది మార్కెట్లు మార్చి భారీ పతనం నుండి రికార్డ్ స్థాయిలో ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
పెద్ద బ్యాంకులు సరే.. సేవింగ్స్ అకౌంట్పై ఈ బ్యాంకులు మంచి ఆఫర్
వచ్చే వారం లోపు 47,000 క్రాస్
మార్చి 23న 26వేల స్థాయికి పతనమైన సెన్సెక్స్ నవంబర్ నెలలో 42,000 మార్కును క్రాస్ చేసింది. ఆ తర్వాత 43,000, 44,000, 45,000, తాజాగా గతవారం 46,000 క్రాస్ చేసింది. ఇప్పుడు 47,000 దిశగా అడుగులు వేస్తోంది. నేడు సెన్సెక్స్ 223.88 పాయింట్లు(0.48%) లాభపడి 46,890.34 పాయింట్ల వద్ద, నిఫ్టీ 58.00 పాయింట్లు(0.42%) ఎగిసి 13,740.70 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్ ఓ సమయంలో 46,983ను క్రాస్ చేసింది. 47,000 మరో పదిహేడు పాయింట్ల దూరంలో మాత్రమే నిలిచింది. ఆ తర్వాత 46,890 వద్ద ముగిసింది. అయితే వచ్చే వారం లోపు 47,000 మార్క్ అందుకునే అవకాశాలు ఉన్నాయి.
ఈ కంపెనీల ఎం-క్యాప్ రూ.1,85,21,248.48 కోట్లు
నిన్నటి వరకు నాలుగు సెషన్లలోనే ఇన్వెస్టర్ల సంపద దాదాపు రూ.3 లక్షల కోట్లు పెరిగింది. ఐదు రోజుల్లో సెన్సెక్స్ 930 పాయింట్ల మేర లాభపడింది. నిన్నటి వరకు నాలుగు రోజుల్లో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.2,93,826.28 ఎగిసి రూ.1,85,13,978.81 కోట్లకు పెరిగింది. నేడు మరింత ఎగిసి రూ.1,85,21,248.48 కోట్లుగా నమోదయింది.
టాప్ 10 కంపెనీలు ఇవే
టాప్ టెన్ కంపెనీల్లో వరుసగా రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాప్ రూ.1258410.68 కోట్లు, టీసీఎస్ 1064889.26 కోట్లు, HDFC బ్యాంకు రూ.793722.01 కోట్లు, హిందూస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్ రూ.544028.00 కోట్లు, ఇన్ఫోసిస్ రూ.493722.20 కోట్లు, HDFC రూ.449044.81 కోట్లు, కొటక్ మహీంద్రా బ్యాంకు రూ.389126.76 కోట్లు, ఐసీఐసీఐ బ్యాంకు రూ.351918.93 కోట్లు, బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ రూ.318422.21 కోట్లు, భారతీ ఎయిర్టెల్ రూ.280906.65 కోట్లుగా నమోదయింది.