గుడ్ న్యూస్: రూ. 2 లక్షల వరకు బంగారం కొనుగోలు చేస్తే కేవైసీ అక్కర్లేదు.. కానీ...!
ఇక నుంచి బంగారం కొనుగోలు చేయాలనుకునే వారు పాన్ వివరాలు లేదా ఆధార్ లాంటి వివరాలు సమర్పించాల్సిన పనిలేదని ఆర్థికమంత్రిత్వ శాఖ కింద పనిచేసే రెవిన్యూ డిపార్ట్మెంట్ పేర్కొంది. ఇది ఒక్క బంగారంకు మాత్రమే కాదని వెండి, నగలు, ఇతర రత్నాలు కూడా వర్తింస్తుందని చెప్పిన కేంద్రం చిన్న మెలిక విధించింది. ఇది రూ.2లక్షల వరకు కొనుగోలు చేసే వాటికి మాత్రమే వర్తిస్తుందని పేర్కొంది. బంగారం, రత్నాలు, వెండి, నగలు కొనుగోలు ఒకవేళ రూ. 10లక్షలు దాటితే మాత్రం కేవైసీ వివరాలు వెల్లడించాల్సిందేనని పేర్కొంది.
అవినీతి నిరోధక చట్టం 2002 ప్రకారం.. రూ.10 లక్షలు లేదా ఆపైన విలువైన బంగారు ఆభరణాలు, వెండి, ఇతరత్రా వాటి కొనుగోలుకు ఎలాంటి లావాదేవీలు నిర్వహించినా కూడా కచ్చితంగా కేవైసీ డాక్యుమెంట్లు అందించాలి. అందువల్ల రూ.2 లక్షలకు లోపు బంగారం కొనేవారు కేవైసీ డాక్యుమెంట్లు అందించాల్సిన అవసరం లేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
రూ. 2 లక్షలు క్యాష్ చెల్లించి కొనుగోలు చేసే బంగారం, నగలు, రత్నాలు, వెండికి కేవైసీ సమర్పించాలని కొన్ని మీడియా ఛానెళ్లు తప్పు దోవ పట్టిస్తున్నాయని ఆర్థిక శాఖ పేర్కొంది. ఉగ్రవాదంకు నిధులు సమకూర్చే ప్రయత్నాలు జరుగుతున్న వేళ గతేడాది డిసెంబర్ 28వ తేదీన ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ చట్టం 2002 కింద ఈ నోటిఫికేషన్ జారీ చేసినట్లు సమాచారం. విలువైన రత్నాలు, విలువైన నగలు ట్రేడింగ్ చేసే FATF డీలర్లు మాత్రం రూ.2లక్షలు మేరా కొనుగోలు చేస్తే వారు మాత్రమే కేవైసీ వివరాలు వెల్లడించాలని స్పష్టం చేసింది. మామూలు కస్టమర్లకు ఇది వర్తించదని వివరించింది ఆర్థిక మంత్రిత్వ శాఖ.