Covid 19: బంగారంపై చమురు 'డిమాండ్' ప్రభావం: పసిడిపై తగ్గనున్న 'భారం'
కోరోనా మహమ్మారి కారణంగా బంగారం ధరలు గత కొద్ది రోజులుగా భారీగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది ప్రారంభం నుండి ఇప్పటి వరకు దాదాపు ఇరవై శాతానికి పైగా పెరిగాయి. అదే సమయంలో చమురు ధరలు పాతాళానికి పడిపోయాయి. దీర్ఘకాలానికి బంగారం సురక్షిత పెట్టుబడిగా బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతారు. లాక్ డౌన్తో పాటు హఠాత్తుగా కొద్ది కాలంలోనే ధరలు పెరుగుతుండటంతో పసిడికి డిమాండ్ పడిపోయిన విషయం తెలిసిందే.
ఊహించినంత ప్రమాదం లేదు, కానీ ఒక్కటి మినహా కీలక రంగాలన్నీ ఢమాల్
చమురుకు డిమాండ్.. బంగారంపై ఒత్తిడి తగ్గుదల
క్రమంగా వివిధ దేశాలు లాక్ డౌన్ ఎత్తివేయటం లేదా ఆంక్షలు ఎత్తివేస్తున్న ప్రస్తుత తరుణంలో చమురుకు డిమాండ్ పెరుగుతుందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్థిక వ్యవస్థలు తిరిగి తెరుచుకోవడం ప్రారంభం అవుతాయి. ఇటలీ, భారత్ వంటి దేశాలు క్రమంగా లాక్ డౌన్ ఎత్తివేతకు సిద్ధమయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో మార్కెట్లు కోలుకోవడంతో పాటు చమురుకు డిమాండ్ పెరిగి, బంగారంపై ఒత్తిడి తగ్గుతుందని భావిస్తున్నారు. ఈ వారంలో ఈ పరిణామాలు చోటు చేసుకుంటాయని భావిస్తున్నారు.
పుంజుకోనున్న మార్కెట్
ఆర్థిక వ్యవస్థ వి ఆకారంలో పుంజుకుంటుందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బంగారంపై స్వల్పకాలికం కంటే దీర్ఘకాలిక పెట్టుబడి బెట్టర్ అని చెబుతున్నారు. బంగారం ఈటీఎఫ్లకు డిమాండ్ ఉన్నప్పటికీ 1,750 డాలర్ల వద్ద ప్రతిఘటన ఎదుర్కొనే అవకాశముందని చెబుతున్నారు.
దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన బంగారం ధర
ఈ రోజు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. ఔన్స్కు 12.210 డాలర్లు లేదా 0.72 శాతం పెరిగి 1,700 డాలర్లకు చేరుకుంది. దేశీయ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,260 పలికింది. 22 క్యారెట్ల పసిడి రూ.45,260 పలికింది.
22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం ధరలు వరుసగా చెన్నైలో రూ.43,610, రూ.46,410, ముంబైలో రూ.45,260, రూ.46,610, బెంగళూరులో రూ.43,610, రూ.46,510, హైదరాబాదులో రూ.43,610, రూ.46,410, విజయవాడలో రూ.43,610, రూ.46,410, విశాఖపట్నంలో రూ.43,610, రూ.46,410 పలికింది.