కరోనా వైరస్ ఎఫెక్ట్: బంగారం, డాలర్ల దిశగా ఇన్వెస్టర్లు, మార్కెట్ నష్టాలకు కారణాలివే
ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం (24 ఫిబ్రవరి) భారీ నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సెన్సెక్స్, నిఫ్టీ ఆ తర్వాత భారీ నష్టాలను మూటగట్టుకుంది. మధ్యాహ్నం ఒకటి సమయానికి సెన్సెక్స్ 413.57 (1.00%) పాయింట్లు నష్టపోయి 40,756.55 వద్ద, నిఫ్టీ 134.30 (1.11%) పాయింట్లు కోల్పోయి 11,946.55 వద్ద ట్రేడ్ అయింది. ఐటీ రంగం మినహా దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టపోయాయి. డాలర్ మారకంతో రూపాయి విలువ పడిపోవడంతో ఐటీ షేర్లు లాభాలు గడించాయి.
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు: 7 వారాల కనిష్టానికి రూపాయి, ఐటీ షేర్లు జూమ్
కరోనా వైరస్ ఎఫెక్ట్
కరోనా వైరస్ కారణంగా మృతుల సంఖ్య పెరుగుతోంది. చైనాలో ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా 2,400 మంది చనిపోయారు. 76,936 కేసులు నమోదయ్యాయి. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ చైనా ప్రభావం అంతర్జాతీయంగానే భారీగానే ఉంది. కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న దేశాల్లో చైనా తర్వాత దక్షిణ కొరియా ఉంది. ఈ దేశంలో 700 కేసులు నమోదయ్యాయి. మృతుల సంఖ్య 7గా ఉంది. కరోనా భయాలు పెరగడంతో ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడుల వైపు చూస్తున్నారు. దీంతో మార్కెట్లు నష్టాల్లోకి జారుకుంటున్నాయి.
పడిపోయిన షేర్లు..
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ భయాలు పెరగడంతో పెట్టుబడిదారులు వెనక్కి తగ్గుతున్నారు. దీంతో హాంగ్ సెంగ్ నిక్కీ, షాంఘై షేర్లు 1.50 శాతం మేర పడిపోయాయి.
సురక్షిత పెట్టుబడులు
అంతర్జాతీయంగా మార్కెట్లలో సెంటిమెంట్ దెబ్బతినడంతో పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడుల వైపు దృష్టి సారించారు. బంగారం, డాలర్ వంటివి కొనుగోలు చేస్తున్నారు. అందుకే అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర 2 శాతం మేర పెరిగింది. 2013 ఫిబ్రవరి తర్వాత మొదటిసారి గరిష్ట హైకి చేరుకుంది. దేశీయ మార్కెట్లో బంగారం ధర రూ.43 వేల మార్క్ దాటింది.
జీడీపీ వృద్ధి రేటు
2019-20 ఆర్థిక సంవత్సరంలోని చివరి క్వార్టర్లో ఉన్నాం. ఈ ఏడాది జీడీపీ వృద్ధి 5 శాతంగా ఉంటుందని నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (NSO) అంచనా వేసింది. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లయిడ్ ఎకనమిక్ రీసెర్చ్ (NCAER) ప్రకారం మరింత తగ్గి 4.9 శాతంగా ఉంటుందని అంచనా. మార్కెట్లపై ఈ ప్రభావం కనిపించింది.
మెటల్ షేర్లు నష్టాల్లో..
మెటల్ కంపెనీల షేర్లు 6 శాతం మేర తగ్గిపోయాయి. బీఎస్ఈలో మెటల్ రంగం నష్టాల్లోనే కనిపిస్తోంది. హిండాల్కో 5.66 శాతం మేర నష్టపోయింది. జిందాల్ స్టీల్, టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, వేదాంత, సెయిల్, నాల్కో, కోల్ ఇండియా, హిందూస్తాన్ జింక్, ఎన్ఎండీసీ షేర్లు 0.90 శాతం నుండి 5 శాతం మేర నష్టపోయాయి.