వ్యాక్సీన్ త్వరగా వచ్చినా ఆర్థిక వ్యవస్థకు భారీ నష్టమే... సుదీర్ఘకాలం ఈ ప్రభావం: రాజన్
గత కొద్ది రోజులుగా కరోనా వ్యాక్సీన్ గురించి సానుకూల వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లు భారీ లాభాల్లో ముగుస్తున్నాయి. ఈ రోజు మాత్రం మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. వ్యాక్సీన్ వచ్చినప్పటికీ కరోనా ప్రభావం ఆర్థిక వ్యవస్థలపై ఎక్కువ కాలం ఉంటుందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. భారత్ వంటి దేశాల్లో సుదీర్ఘ లాక్ డౌన్ విధించారు. ఆర్థిక వ్యవస్థలు తిరిగి కోలుకుంటున్నప్పటికీ అప్పుడే పూర్తిగా సర్దుకున్నట్లు కాదని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ చెబుతున్నారు.
గుడ్న్యూస్: ఐటీలో వేలాది ఆఫర్స్, HCLలో 15,000 ఉద్యోగాలు
చాలాకాలం పాటు ఈ ప్రభావం
కరోనా వైరస్ వల్ల జరిగిన ఆర్థిక నష్టం ప్రభావం చాలాకాలం ఉంటుందని రాజన్ భావిస్తున్నారు. ఈ మేరకు ఆయన బుధవారం సీఎన్బీసీ స్ట్రీట్ సైన్స్ ఏసియాతో మాట్లాడారు. చాలా వ్యాపారాలకు ఎక్కువ కాలం ఆదాయం లేని పరిస్థితి అని, అదే సమయంలో అధిక వ్యయాలు కొంతమంది వ్యాపారాలు మూతబడటానికి కారణం అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు దాదాపు 15 కోట్లు దాటాయి. మరణాలు ఆరు లక్షలు దాటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీతో పాటు ఆస్ట్రాజెనెకా వంటి ఫార్మా సంస్థలు కరోనా వ్యాక్సీన్లో పురోగతిని వెల్లడిస్తున్నాయి.
ఆర్థిక వ్యవస్థపై ప్రభావం
అయితే వ్యాక్సీన్ 2020లో వచ్చినప్పటికీ ఇప్పటికే జరగాల్సిన ఆర్థిక నష్టం జరిగిపోయిందని రఘురాం రాజన్ అభిప్రాయపడ్డారు. వ్యాక్సీన్ వచ్చినప్పటికీ ఆర్థిక వ్యవస్థలపై పెను ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. చాలామందికి టీకాలు వేయాల్సి ఉంటుందని, అన్నీ ప్రణాళిక ప్రకారం జరుగుతాయా అంటే జరగకపోవచ్చునన్నారు.
ఈ రంగాలు కోలుకుంటేనే..
పాలకుల నుండి సహకారం ఉన్నప్పటికీ కొంతకాలం ఆర్థిక వ్యవస్థలు అనుకున్నంత త్వరగా కోలుకునే అవకాశాలు లేవని రాజన్ అభిప్రాయపడ్డారు. ఈ పరిస్థితుల్లో పారిశ్రామిక దేశాలు పెద్ద ఎత్తున పాలసీ రియాక్షన్స్ చూశాయని, అభివృద్ధి చెందుతున్న దేశాలు మాత్రం కొంతభాగం మాత్రమే చూశాయన్నారు. ప్రజలు మళ్లీ కలిసిపోయేలా నడుచుకోవడంతో పాటు రెస్టారెంట్, ట్రావెల్, టూరిజం వంటి అధిక వ్యయ కార్యకలాపాలు పునరుజ్జీవం పొందే వరకు ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కోలుకోదన్నారు. అప్పటి వరకు 95 శాతం ఆర్థిక వ్యవస్థ మాత్రమే అన్నారు. కరోనా ప్రభావిత రంగాలకు దీర్ఘకాలిక సాయాన్ని అందించడం గురించి ప్రభుత్వాలు ఇప్పుడు ఆలోచించాలని రాజన్ అన్నారు.